అట్టర్ ఫ్లాప్..!
ABN , Publish Date - Mar 29 , 2024 | 01:02 AM
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయింది. మధ్యాహ్నానికే జనాన్ని తరలించగా ఎండ వేడిమికి తట్టుకోలేక జనాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఫెయిల్ అయిన జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ
ఎండవేడిమికి తట్టుకోలేక జారుకున్నజనాలు
సీఎం స్పీచ్ వినలేక ప్రజలు పరార్..!
నంద్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయింది. మధ్యాహ్నానికే జనాన్ని తరలించగా ఎండ వేడిమికి తట్టుకోలేక జనాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం జగన్ వచ్చే సమయానికి సభా స్థలి ఖాళీ అయింది. గురువారం మొదట ఆళ్లగడ్డలోని విడిది కేంద్రం నుంచి నంద్యాల వరకు బస్సు యాత్ర సాగింది. సాయంత్రం నంద్యాల పట్టణంలో సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అట్టహాసంగా రెండో రోజు మొదలు పెట్టిన యాత్ర, సభ ఫెయిల్ కావడంతో సీఎం జగన్తోపాటు, జిల్లా నాయకుల ముఖాలన్నీ వాడిపోయాయి. ముప్పావు వంతు ఖాళీగా ఉన్న సభలోనే సీఎం జగన్ ప్రసంగించి, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించడని కోరారు. అదే మూసకట్టు ప్రసంగాన్ని వినలేక ప్రజలు అక్కడి నుంచి జారుకున్నారు. సభాస్థలిలో నాయకులకు తప్పా సభకు వచ్చిన సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో సభకు వచ్చిన వారంతా ఎండ వేడిమికి, దప్పికకు అలమటించారు. చివరలో ఉన్న వారికి నీటిని అందించిన, సభా ప్రాంగణం మధ్యలో ఉన్న వారికి నీరందించే వారు లేక ఇబ్బంది పడ్డారు.
డబ్బులిచ్చి తరలించారు..
వైసీపీ నేతలు ఒక్కొక్కరికి రూ.200 ఇచ్చి జనాన్ని తరలించినట్టు తెలుస్తోంది. పురుషులకైతే క్వార్టర్ బాటిల్ అదనం. మందు బాబులు సభా ప్రాంగణంలోనే తాగిపడిపోయారు. బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి మొదలైన తర్వాత అదే మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో రైతులు, మేధావులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. వారు ఎంపిక చేసుకున్న వారు సీఎం జగన్తో మాట్లాడే విధంగా వారిలోని కొంతమందికి టోకెన్లు కూడా జారీ చేశారు. ఆ టోకెన్ల వారిగా మాట్లాడించేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ వారు అనుకున్నట్లుగా రైతులు, మేధావులు సమా వేశానికి హాజరు కాకపోవడంతో, వచ్చిన వారితోనే ముఖాముఖి నిర్వహించినట్లు సమాచారం.