యార్డు నిండా వాము పొట్టే..
ABN , Publish Date - May 25 , 2024 | 12:27 AM
కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించడానికి ప్లాట్ఫారాలు ఏర్పాటు చేశారు.
![యార్డు నిండా వాము పొట్టే..](https://media.andhrajyothy.com/media/2024/20240511/24agri1f_893414f9d7.gif)
పంట ఉత్పత్తులు ఎక్కడ పెట్టుకోవాలంటున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్), మే 24: కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించడానికి ప్లాట్ఫారాలు ఏర్పాటు చేశారు. అయితే.. సెస్సు ఆదాయాన్ని పెంచుకోవడానికో లేకపోతే మరేదైనా వ్యాపారుల నుంచి ప్రయోజనం పొందడానికో తేలీదు కానీ.. ప్లాట్ఫారాల నిండా వాము పొట్టును నిల్వ చేసుకోవడానికి వ్యాపారులకు అధికారులు అనుమతి ఇచ్చారు. గతంలో కేవలం ఒక ప్రదేశంలోనే వ్యాపారులకు వాము పొట్టును నిల్వచేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం వ్యాపారులు మార్కెట్ యార్డులో ఉన్న అన్ని ప్లాట్ఫారాల వద్ద పెద్ద ఎత్తున వాము పొట్టును నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేసుకోవాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. గతంలో వాము పొట్టును ఎటువంటి సెస్సును వసూలు చేయ కుండా అప్పటి అధికారులు ఎక్కడ పడితే అక్కడ వ్యాపారులు నిల్వ చేసు కునేందుకు అవకాశం కల్పించారని, ప్రస్తుతం తాము వాము పొట్టు నుంచి సెస్సును వసూలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. అయితే రైతుల కోసం ఉద్దేశించిన మార్కెట్ యార్డులో ఇతర వ్యాపకాలను కొనసాగించడం ఏమిటని రైతు సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు.