భూములు కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ABN , Publish Date - May 08 , 2024 | 12:59 AM
ప్రజల భూములను కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్రెడ్డి తీసుకొచ్చారని నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు.
![భూములు కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
ఓర్వకల్లు, మే 7: ప్రజల భూములను కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్రెడ్డి తీసుకొచ్చారని నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేదన్నారు. ప్రజల భూములను కబ్జా చేసేందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని తెలిపారు. ఇది అక్టోబరు 31 నుంచే అమలులోకి వచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం జీవో నెం.512ను విడుదల చేసిందని అన్నారు. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్ సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబరు 29న ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి ఇంకా ఈ చట్టానిక మార్గదర్శకాలు ఇవ్వలేదంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం కొల్లగొట్టడం ద్వారా రూ.8 లక్షల కోట్లు స్వాహా చేశారన్నారు. మన ఆస్తులకు మనం యజమానులుగా ఉండాలంటే.. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి, తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బజారు, అన్వర్బాషా, వేణు, కేవీ మధు, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తక్షణమే విరమించుకోవాలి
వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టైటిల్ రిజిస్ర్టేషన్, ల్యాండ్ అఫిలేట్ అథారిటీల నియామక సూత్రాలు, వివాదాల రిజిస్ర్టేషన్ నిర్వహణ, యాజమాన్య హక్కుల వివాదాల పరిష్కారంలో సివిల్ కోర్టు పాత్రను పూర్తిగా ఈ యాక్ట్ తొలగించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, భాస్కర్రెడ్డి అబ్దుల్లా, శ్రీరాములు, అల్లాబాబు, నాగరాజు పాల్గొన్నారు.