పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోండి: కలెక్టర్
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:39 PM
తరహా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 24: తరహా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పండిస్తున్న టమోటా, ఉల్లి తదితర ఉత్పత్తుల మార్కెటింగ్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు రూ.10 లక్షల రుణం మంజూరులో రూ.3.50 లక్షల సబ్సిడీ ఉందన్నారు. ఈ పథకం ద్వారా ఆదోని, పత్తికొండ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న టమోటా, ఉల్లి స్టోరేజ్, ప్రాసిసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని అధికారులను సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేలా పథకం వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని, అలాగే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పరిశ్రమల శాఖ జీఎం మారుతి ప్రసాద్, ఏపీఐఐసీ జీఎం సోమశేఖర్ రెడ్డి, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.