మల్లన్న భక్తులకు ఎస్పీ సూచనలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:25 AM
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు నంద్యాల ఎస్పీ పలు సూచనలు చేశారు.
నంద్యాల క్రైం, మార్చి 7: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు నంద్యాల ఎస్పీ పలు సూచనలు చేశారు. గురువారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనార్థం శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ ఫోర్ వీలర్ వాహనాలకు అనుభవం ఉన్న డ్రైవర్లను సమకూర్చుకోవాలన్నారు. అనుభవంలేని డ్రైవర్ల మూలంగా వాహనాల క్లచ్ ప్లేట్లు పోయి ప్రయాణం మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డులో వాహనాలను ఓవర్టేక్ చేయకూడదన్నారు. అలాగే ఓవర్ లోడ్తో ఘాట్రోడ్డులో ప్రయాణించ కూడదన్నారు. మోటార్ సైకిళ్లపై వెళ్లే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయవద్దని సూచించారు. పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాలనాలను నిలపాలన్నారు. సాక్షిగణపతి వద్దకు కాలినడకన వెళ్లి దర్శనం చేసుకోవాలని, వాహనాలను నిలిపి దర్శనం చేసుకోవద్దని సూచించారు. తినుబండారాలు, బొమ్మలు, ఆటవస్తువులు, పూజాసామగ్రి అమ్మేవారు ఘాట్ రోడ్డులో ఎక్కడా ఉండకూడదన్నారు. మహాశివరాత్రి రోజు రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు దోర్నాల నుంచి పైకి శ్రీశైలం వైపు ఎటువంటి వాహనాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. పాతాళగంగ ఘాట్ల దగ్గర స్నానం ఆచరించే భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా గత ఈతగాళ్లను నియమించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాహనాలను ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను మేకలబండ వెనుక ప్రాంతంలో, టూరిస్టు వాహనాలను మేకలబండ పక్కన గల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్లు ఆలయం వెనుక భాగంలో, ఓల్డ్ హెలిప్యాడ్, స్కూల్, నిత్యాన్నదాన సత్రం పక్కన పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.