ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:49 PM
ఉద్యమాలతోనే విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యమాలతోనే విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక సలాంఖాన్ ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు గోకారి అధ్యక్షతన జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్, జీపీఎ్సలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న 21 వేల కోట్ల బకాయిలను మంజూరు చేయాలని కోరారు. జీవో 84ను సవరించాలని, బదిలీలకు పదోన్నతులకు శాశ్వత కోడ్ చట్టం రూపొందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ నాగరాజు, వెంకటేశ్వర్లు, బి.నాగరాజు, సుంకన్న, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎంసి.సుంకన్న ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, బసవరాజు, ప్రసన్న పాల్గొన్నారు.