వైసీపీకి షాక్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:21 AM
జిల్లాలో వైసీపీకి గట్టిషాక్ తగిలింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ సభ్యత్వానికి, మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
మంత్రి జయరాం ఆ పార్టీకి రాజీనామా
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
కర్నూలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైసీపీకి గట్టిషాక్ తగిలింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ సభ్యత్వానికి, మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సదస్సులో మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రి జయరాం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు సోదరులు గుమ్మనూరు నారాయణ, నారాయణస్వామి, గుమ్మగనూరు శ్రీనివాసులు సహా ఆలూరు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ మండల కన్వీనర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ 12 ఏళ్లు వైసీపీ జెండా మోశానని, ఆలూరు ప్రజలకు దూరం కావడం ఇష్టం లేదన్నారు. అందుకే కర్నూలుఎంపీ టికెట్ ఇచ్చినా వెళ్లలేదన్నారు. సీఎం జగన్ శిలావిగ్రహమైతే ఆ శిల్పానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి ఇద్దరు పూజారులు అని జయరాం ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.