Share News

సాయిప్రసాద్‌రెడ్డి కబ్జాకోరు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:50 PM

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఓ పేకాటరాయుడు, కబ్జాకోరు అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

సాయిప్రసాద్‌రెడ్డి కబ్జాకోరు

ఇలాంటి వ్యక్తికి ఓటేస్తారా?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఆలూరు/ ఎమ్మిగనూరు/ఆదోని, ఏప్రిల్‌ 19: ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఓ పేకాటరాయుడు, కబ్జాకోరు అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఆమె ‘ఏపీ న్యాయయాత్ర’ నిర్వహించారు. ఆలూరులోని అంబేడ్కర్‌ సర్కిల్‌, ఆదోనిలోని శ్రీనివాస భవన్‌ కూడలి, ఎమ్మిగనూరు పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మీద విరుచుకపడ్డారు. ఆయన కబ్జాకోరు అని అంటూ ఏదైనా స్థలం కోటి విలువ చేస్తే, ఆయన ఇంట్లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారట కదా...? అని ప్రజలను అడిగారు. ఇలాంటి దోపిడీదారుకు మీరు ఓటు వేస్తారా? అని అడిగారు. ఎమ్మెల్యే ఇక్కడి పత్తి రైతులకు కనీస గిట్టుబాటు ధర లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌ ప్రభుత్వంలో పత్తి క్వింటం రూ.12వేలు పలికేదని, ఇప్పుడు రూ.6వేలు కూడా పలకడం లేదని అన్నారు. స్థానికంగా ఉన్న స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడి వేల మంది ఉపాధి కోల్పోయి వీధిన పడినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని, వాటిని తెరిచే ప్రయత్నం లేదని విమర్శించారు. అంతకు ముందు ఆప్‌ స్థానిక నాయకులు కాశీంనాయుడు షర్మిలను కలిసి పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బాబురావు, ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్‌, డీసీసీ కార్యదర్శి కాశింవలి, నీలకంఠప్ప, సీపీఐ, సీపీఎం నాయకులు భూపేష్‌, నారాయణ, రంగన్న, రాముడు పాల్గొన్నారు.

అభ్యర్థులను ఖరారు చేసిన వైఎస్‌ షర్మిల

ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం అఽభ్యర్థిగా వంశీ చైతన్య ఆసుపత్రి అధినేత రమేష్‌ యాదవ్‌, ఆలూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నవీన్‌ కిషోర్‌లను షర్మిల ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్‌ను ఆమె గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మిగనూరులో పర్యటించిన షర్మిల మాత్రం అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు.

Updated Date - Apr 19 , 2024 | 11:50 PM