వైభవంగా పల్లకీ ఉత్సవం
ABN , Publish Date - May 25 , 2024 | 11:53 PM
శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
![వైభవంగా పల్లకీ ఉత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240511/25_slm_7f_b9b515a0a9.gif)
శ్రీశైలం, మే 25: శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి పల్లకీలో ఆశీనులనుజేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాన్ని నిర్వహించారు.
ఆకట్టుకున్న నిత్యకళారాధన: శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో శనివారం గుంటూరు చెందిన శ్రీనిధి నృత్యాలయం బృందంతో సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహాగణపతిం, మూషికవాహన, జతిస్వరం, అఖిలాండేశ్వరి, శివతాండవం తదితర గీతాలకు కళాకారులు నృత్యప్రదర్శనతో ఆకట్టుకున్నారు.