పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Oct 28 , 2024 | 11:47 PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో ఆదోనిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు.
మార్కెట్ యార్డు కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి
ఆదోని అగ్రికల్చర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో ఆదోనిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. నాగేంద్ర జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలో మార్కెట్ యార్డు కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, సీసీఐ కేంద్రం ఇన్చార్జి గౌతమ్ రైతులతో కలిసి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సీసీఐని రంగంలోకి దించిందని తెలిపారు. సీసీఐ రైతుల నుంచి పత్తి మద్దతు ధర క్వింటాలు రూ.7,521కు కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో సీసీఐకి పత్తి దిగుబడిని విక్రయించుకునేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. తమ పత్తి దిగుబడికి తేమ 8ు నుంచి 12ు మించకూడదని సూచించారు. ఇప్పటికే నాగేంద్ర జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమ, ఎన్డీబీఎల్, జయంత్ కాటన్స్, ధారశ్రీ, చెన్నకేశవ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమల్లో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ యజమాని లక్ష్మణరావు, అనిల్, సహాయ కార్యదర్శి శాంత కుమార్, సూపర్వైజర్లు మోహన్ రెడ్డి, నరేష్, జ్ఞానప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.