ఇక మిగిలింది 73 రోజులే..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:36 AM
‘జెండాలు పట్టండి.. జనాల్లోకి వెళ్లండి.. ఇక మిగిలింది 73 రోజులే.. రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగా ఉండండి.
జెండాలు పట్టి జనాల్లోకి వెళ్లండి
జగన్ను ఇంటికి సాగనంపండి
కర్నూలుకు హైకోర్టు బెంచ్ బాధ్యత నాది
‘సూపర్ సిక్స్’తో పేదరికాన్ని నిర్మూలిస్తా
పత్తికొండ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
కర్నూలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి)/పత్తికొండ: ‘జెండాలు పట్టండి.. జనాల్లోకి వెళ్లండి.. ఇక మిగిలింది 73 రోజులే.. రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగా ఉండండి.. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్రెడ్డిని ఇంటికి సాగనంపండి.. అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పత్తికొండలో ఆదివారం జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ 73 రోజులు కష్టపడితే.. ఈ రాష్ట్రానికి పట్టిన సైకో జగన్ పీడ విరుగడవుతుందని, రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందని అన్నారు. పత్తికొండ సభను చూస్తే సైకో జగన్కు రాత్రి నిద్రపట్టదని, తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోతాయని అన్నారు. ప్రజల ఉత్సాహాన్ని చూస్తే టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ‘ఉరవకొండ, పీలేరు సభల కంటే పత్తికొండ సభ దద్దరిల్లిందని, యువత బాధ, రైతు వ్యథ, వలస రైతుల ఆక్రందన, ఉద్యోగుల బాధలు, దగా పడ్డ యువత ఆక్రోశం మీలో కనిపిస్తోందని, మీకు భరోసా ఇస్తున్నా’.. కర్నూలు జిల్లాను బాగు చేసే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. దీంతో జనాలు రెట్టింపు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
సూపర్ సిక్స్తో పేదరిక నిర్మూలన:
టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి పేదరికాన్ని నిర్మూలిస్తానని టీడీపీ అధినేత అన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికీ మహాశక్తి కింద నెలకు రూ.1,500, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతోపాటు ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తామని, యువగళం కింద లక్షల ఉద్యోగాల నియామకం కల్పిస్తాం స్పష్టం చేశారు. ఇంటింటికి సురక్షిత నీరందిస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని భరోసా ఇచ్చారు. జగన్ పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
గత ఎన్నికలకు ముందే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని చంద్రబాబు ఉద్ఘాటించారు. అందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ జగన్ వచ్చాక మూడు రాజధానుల పేరుతో దగా చేశాడని. టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాననీ చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు.
పేరుపేరునా పలకరింపు
చంద్రబాబు హెలిప్యాడ్కు రాగానే టీడీపీ కార్యకర్తలు ఉవ్వెత్తున అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును చూసేందుకు పోటీ పడ్డారు. అక్కడి నుంచి వేదికపైకి చేరుకున్న చంద్రబాబు జిల్లా నాయకులను పేరుపేరునా పలకరించారు. నాయకులు అధినేత చంద్రబాబుకు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.