జొన్న పంటను కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:05 AM
జొన్న పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
రైతులతో కలిసి కలెక్టర్, జేసీని కలిసిన గౌరు చరిత
నంద్యాల(ఆంధ్రజ్యోతి)/గడివేముల, మార్చి 2: జొన్న పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మండలంలోని పెసరవాయి, కరిమద్దెల గ్రామాల రైతులతో ఆదివారం నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్తో కలిసి గౌరు చరిత సమావేశమయ్యారు. దీంతో జొన్న పంట కొనుగోలులో అధికారులు వివక్ష చూపుతున్నారని, ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదని, అధికార పార్టీ అనునయులకే సంచులు పంపిణీ చేస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ముందు వాపోయారు. దీంతో ఆమె రైతులతో కలిసి కలెక్టర్ శ్రీనివాసులు, జేసీ రాహుల్కుమార్రెడ్డిలను కలిశారు. మండలంలో జొన్న పంట కొనుగోలులో అధికారులు అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణి, గోనె సం చులు ఆర్బీకేలకు రాకుండానే వైసీపీ నాయకుల ఇళ్లకు చేరుతున్న వైనంపై కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం పంట కొనుగోలుపై వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన జొన్న పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సీతారామిరెడ్డి, టీడీపీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణయాదవ్, ఈశ్వర్రెడ్డి, వడ్డు లక్ష్మీదేవి, కాలిద్బాషా, సుభద్రమ్మ, సుదర్శన్రెడ్డి, బాలిశ్వర్రెడ్డి పాల్గొన్నారు.