Share News

వైసీపీలో ముసలం

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:04 AM

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ముసలం నెలకొంది. పది మంది కార్పొరేటర్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

వైసీపీలో ముసలం

పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధం?

పార్టీలో చిచ్చురేపిన ‘మేయర్‌’ మార్పు ప్రకటన

కర్నూలు(న్యూసిటీ), మార్చి 13: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ముసలం నెలకొంది. పది మంది కార్పొరేటర్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 25వ వార్డు కార్పొరేటర్‌ సత్య నారాయణమ్మకు మేయర్‌గా కల్పిస్తున్నట్లు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేయడం ఆ పార్టీలో చిచ్చుకు కారణమైంది. ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కనబెట్టి కార్పొరేటర్‌గా బి-ఫారం తీసుకున్నప్పుడు పార్టీ కండువా వేసుకుని వచ్చిన వారికి మేయర్‌ పదవి ఎలా ఇస్తారని కొందరు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు సోషల్‌మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. కలెక్టర్‌కు రాజీనామా లేఖలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే నేరుగా తమ రాజీనామాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సీటు కేటాయించకపోవడంతో పార్టీ కో ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డికి ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అది మరువక ముందే మరోసారి వైసీపీలో దుమారం రేగింది. రాజీనామాలు చేసిన వైసీపీ కార్పొరేటర్లను బుజ్జగించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ముగుర్గు కార్పొరేటర్లు ఆగ్రహంగా ఉన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:04 AM