Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

హంస వాహనంపై ఆది దేవుడు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:24 AM

హంస వాహనంపై ఆది దేవుడు

హంస వాహనంపై ఆది దేవుడు

శ్రీగిరిపై వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

భారీగా తరలి వస్తున్న భక్తులు

ఇరుముడి స్వాములకు ప్రత్యేక క్యూలైన్‌

శ్రీశైలం, మార్చి 3: ఇల కైలాసమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలు, హారతులు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలకి తోడ్కొని వచ్చారు. అనంతరం ఆలయ రాజగోపురం గుండా గంగాధర మండపం చేరుకొని ప్రత్యేక పూజా దికాలు నిర్వహించి క్షేత్రపుర వీధుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. గ్రామోత్సవం ముందు కోలా టం, చెక్కభజన, రాజభటుల వేషాలు, జాంజ్‌ పథక్‌, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, బుట్టబొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, బంజారా నృత్యం, చెంచు నృత్యం, శంఖానాదాలు మార్మోగాయి. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నంది మండపం వరకు తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం దాకా కొనసాగింది. హంస వాహనంపై విహరించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మ వార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు.

పట్టువస్త్రాల సమర్పణ

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిఅమ్మవార్ల దేవస్థానం తరపున ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కె. రాంబాబు, కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామా రావు, వేదపండితులు పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్ర మంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అను సరించి దర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి. పెద్దిరాజు, అధికారులు, అర్చకులు, వేదపండితులు దుర్గామల్లేశ్వర స్వామిఅమ్మవార్ల దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు.

నేడు మయూర వాహన సేవ

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నాలుగో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించ నున్నారు.

భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులతో శ్రీశైల క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. అలాగే క్షేత్రంలోని అన్నదాన సత్రాలు, వసతి కేంద్రాలు భక్తుల సేవలో తరిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీగిరి చేరుకొని మల్లన్న దర్శనానికి పోటెత్తారు. భక్తులకు దర్శనం కోసం ఉచిత క్యూలైన్‌, శీఘ్ర దర్శనం, అతి శీఘ్రదర్శనంతోపాటు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. క్యూలైన్లన్ని భక్తులతో నిండిపోయాయి. స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో ఇరుముడి సమర్పణ

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండల, అర్ధమండల దీక్షను స్వీకరించిన శివ స్వాములు శ్రీశైలం మల్లన్న కు ఇరుముడులు సమర్పిస్తున్నారు. ముందుగా దేవస్థానం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా శివస్వా ము లు ఇరుముడులతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శివదీక్షా శిబిరాలలో శాస్ర్తోక్తంగా శివదీక్ష విరమిం చారు.

Updated Date - Mar 04 , 2024 | 12:24 AM