Share News

క్రిష్ణగిరి ఎస్‌ఐ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

ABN , Publish Date - May 03 , 2024 | 12:16 AM

క్రిష్ణగిరి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు.

క్రిష్ణగిరి ఎస్‌ఐ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

పత్తికొండ, మే 2: క్రిష్ణగిరి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి గురువారం యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. క్రిష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కాన్వాయ్‌తో క్రిష్ణగిరికి బయలుదేరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులు, ఎస్‌ఐలు పైలట్‌ వాహనం ఏర్పాటు చేయరాదు. అయితే క్రిష్ణగిరి ఎస్‌ఐ అత్యుత్సాహం చూపి అమకతాడు నుంచి క్రిష్ణగిరికి వెళ్లే కాన్వాయ్‌ ఎదుట తన వాహనాన్ని పైలట్‌ వాహనంగా వెళ్తూ ముందుకు సాగారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై పత్తికొండ ఆర్వో రామలక్ష్మికి వివరణ కోరగా.. ఇప్పటికే తమకు ఈ విషయంపై ఫిర్యాదు వచ్చిందన్నారు. విచారణ చేపట్టాలని పత్తికొండ డీఎస్పీని ఆదేశించామన్నారు. రాజకీయ నేతలకు ఇలా పైలట్‌ వాహనంగా వెళ్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని ఆర్వో తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 12:16 AM