Share News

కరువు మండలంగా ప్రకటించాల్సిందే

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:48 AM

తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిందే.. అని రైతులు పత్తికొండ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

కరువు మండలంగా ప్రకటించాల్సిందే

ఆర్డీవో కార్యాలయం ముట్టడించిన తుగ్గలి రైతులు

పత్తికొండ, జనవరి 8 : తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిందే.. అని రైతులు పత్తికొండ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సోమవారం టీడీపీ కార్యాలయం నుండి అఖిలపక్షాల ఆధ్వర్యంలో రైతులు ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో రామలక్ష్మితో మాట్లాడుతూ అధికారులకు తమ కష్టాలు పట్టవా? అని తుగ్గలి మండలం రైతులు నిలదీశారు. అంతక ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించే విషయంలో నివేదికలు పంపామని అధికారులు రెండు నెలలుగా చెబుతున్నారేగాని ఫలితం కనిపించడం లేదని అన్నారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం తుగ్గలి, కర్నూలు రూరల్‌ మండలాలను జాబితాలో చేర్చలేదని అన్నారు. జడ్పీమాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, సీపీఐ జిల్లా నాయకులు గిడ్డయ్య, నబిరసూల్‌ మాట్లాడుతూ.. ముందస్తు వర్షాలకు పంటలు సాగుచేసిన తుగ్గలి మండల రైతులు ఆ తర్వాత వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయితే శాటిలైట్‌ ద్వారా చేసిన సర్వేలో తుగ్గలి మండలంలో కరువు లేదని ప్రభుత్వం నిర్ధారణకు రావడం దారుణమని అన్నారు. తుగ్గలి మండలంలో కరువు పరిస్థితులపై రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్డీవో కార్యాలయం ముట్టడితో ఉద్రిక్తత..

రహదారి బైఠాయింపు అనంతరం ఆర్డీవో కార్యాలయం ముట్టడికి అఖిలపక్షం నాయకులు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయంలోకి అఖిలపక్షం నాయకులు, రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు ఆర్డీవో జోక్యం చేసుకోవడంతో కార్యాలయం ముందు బైఠాయించారు. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్న నివేదికలు కలెక్టర్‌ పంపామని, జిల్లాకు వచ్చిన కరువు బృందానికి కలెక్టర్‌ నివేదికలు అందించారని ఆర్డీవో వారికి వివరణ ఇచ్చారు. అయితే కరువు మండలం ప్రకటించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని కరువుబృందానికి నివేదికలు ఇస్తే తమకు న్యాయం ఎలా జరుగుతుందని రైతులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చందోలితిరుపాల్‌, తిరుపాల్‌నాయుడు, గుడిసె నరసింహులు, జనసేన ఇన్‌చార్జి రాజశేఖర్‌, సీపీఐ నాయకుడు మద్దిలేటి శెట్టి, సుల్తాన్‌, పెద్దఈరన్న పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:48 AM