రైతులకు శుభవార్త
ABN , Publish Date - May 21 , 2024 | 12:07 AM
రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని, ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అత్యవసరమైన నైరుతి రుతుప వనాలు రెండు రోజుల కిందట దక్షిణ అండమాన్ ప్రాం తంలో నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
![రైతులకు శుభవార్త](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఈసారి మంచి వర్షాలే కురుస్తాయి
ముందస్తు వానాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్), మే 20: రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని, ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అత్యవసరమైన నైరుతి రుతుప వనాలు రెండు రోజుల కిందట దక్షిణ అండమాన్ ప్రాం తంలో నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. దీని వల్ల ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని తెలిపారు. మే 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని, జూన్ మొదటి వారంలో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురుస్తాయని జేడీ వరలక్ష్మి తెలిపారు. బంగాళాఖాతంలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయని, ఎల్నీనో బలహీనమై లానినో పరిస్థితులు వచ్చే అవకాశం ఉండటం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఆమె స్పష్టం చేశారు. భూమధ్య రేఖ వద్ద ఫసిఫిక్ సముద్రం చల్లబడటంతో వర్షాలు కురవడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లు జేడీ వరలక్ష్మి అన్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అధికవర్షపాతం కురిసేందుకు అవకాశం ఉందని వారు అంచనా వేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో మే 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల మే 24న అల్పపీడనం వాయుగుండంగా మారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 6.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధిక దిగుబడి ముందస్తు వర్షాల వల్ల సాధ్యమవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ 77.7ఎంఎం, జూలైలో 90.7, ఆగస్టులో 116.2, సెప్టెంబరులో 116.5 ఎంఎం మొత్తం 406.1 ఎంఎం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.