Share News

భూ అక్రమార్కులను వదలకండి

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:02 AM

భూ అక్రమార్కులను వదలకండి

భూ అక్రమార్కులను వదలకండి

రెవెన్యూ అధికారుల సమీక్షలో మంత్రి బీసీ

కొలిమిగుండ్ల, ఆగస్టు 20: వైసీపీ హయాంలో భూ అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టకూడదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలోని మంత్రి స్వగృహంలో నంద్యాల ఆర్డీఓ మల్లికార్జునరెడ్డి, కొలిమిగుండ్ల తహసీల్దార్‌ బాల ఈశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారులతో మంత్రి బీసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల మండలంలో జరిగిన ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణపై మంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి, దోచుకున్నారని, వారికి కొందరు అధికారులు కూడా సహకరించారన్నారు. ఈ అక్రమాల్లో వీఆర్వో, సర్వేయర్లపైనే కాకుండా వారితో తప్పులు చేయించిన ఉన్నతాధికారులు, నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతిని ఉపేక్షించదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు గాలికి వదిలారని తెలిపారు. ఇస్టానుసారంగా ఆక్రమణలు, స్థలాల అమ్మకాలు జరిగాయన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రజా ప్రతినిధులే ఆక్రమణలు ప్రోత్సహించడం బాధాకరమన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే చట్టబద్ధంగా ఇంటి స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విక్రయించారన్నారు. వీటిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి బీసీ అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:02 AM