దారి మళ్లిన చేపల మార్కెట్ నిధులు
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:34 AM
కర్నూలు నగరంలో మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్ను ఏర్పాటు చేయడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గాలిలో కలిపేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
![దారి మళ్లిన చేపల మార్కెట్ నిధులు](https://media.andhrajyothy.com/media/2023/20231205/30agri1_52331e0455.gif)
ప్రభుత్వ నిర్వాకంపై మత్స్యకారుల ఆగ్రహం
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 31: కర్నూలు నగరంలో మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలతో చేపల మార్కెట్ను ఏర్పాటు చేయడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గాలిలో కలిపేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ చేపల మార్కెట్ ఏర్పాటు కోసం కేటాయించిన రూ.5 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు సీ. క్యాంపు రైతు బజారును విస్తరించే కార్యక్ర మంలో భాగంగా శిథిలమైన రెవెన్యూ క్వార్టర్స్ను మార్కెటింగ్ శాఖ తన ఆధీనంలోకి తీసుకుని ఈ చేపల మార్కెట్ను ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కింగ్ మార్కెట్లో చేపలను కొనేందుకు వెళ్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు, ఇరుకు స్థలంతో పది మంది కూడా ఆ మార్కెట్లో ఉండలేక పోతున్నారు. అప్పట్లో మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు ఆధునిక సౌకర్యాల తో చేపల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు రూ.5 కోట్లను వెంటనే విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకటరమణ ఈ చేపల మార్కెట్ శంకుస్థాపనకు వచ్చారు. అయితే అప్పటి వైసీపీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి మంత్రి వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ చేపల మార్కెట్ ఏర్పాటు గురించి పట్టుకున్న నాథుడే కరువ య్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపల మార్కెట్ను ఏర్పాటు చేసి తమ జీవనోపాధిని మెరుగుపరచాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టారు
కర్నూలు నగరంలో అధునాతనమైన చేపల మార్కె ట్ను ఏర్పాటు చేసేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం రూ.5కో ట్లను మంజూరు చేసింది. ప్రస్తుత వైసీపీ ప్రభు త్వం ఆ నిధులను దారి మళ్లించింది. చేపల మార్కెట్ ఏర్పాటు చేయ కపోతే ఆందోళనలు చేపడుతాం.
- పీజీ వెంకటేష్, మత్స్యకారుల సంఘం రాయలసీమ ప్రతినిధి