Share News

వైసీపీలో కొట్లాట

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:38 AM

దాదాపు ఎకరా 87 సెంట్ల ఖాళీ స్థలం అది. ఆ భూమిపై వైసీపీలోని ఓ వర్గ నాయకులు కన్నేశారు.

వైసీపీలో కొట్లాట

గ్రామ కంఠం స్థలంపై ఓ వర్గం కన్ను

అడ్డుకున్న సర్పంచ్‌ వర్గీయులు

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

మద్దికెర, మార్చి 17: దాదాపు ఎకరా 87 సెంట్ల ఖాళీ స్థలం అది. ఆ భూమిపై వైసీపీలోని ఓ వర్గ నాయకులు కన్నేశారు. ఆ ప్రాంతంలో సచివాలయం, ఆర్‌బీకే, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో ఆ స్థలం విలువైనదిగా భావించి రాత్రికి రాత్రే 25 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. అయితే.. ఆ స్థలం పంచాయతీదని, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారంటూ సర్పంచు వర్గీయులు అడ్డుకోవడంతో పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది.మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో సర్వే నెంబర్‌.261లో ఎకరా 87 సెంట్ల గ్రామ కంఠం స్థలం ఉంది. అయితే మండల కన్వీనర్‌ గంపల వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి 28 మందికి పొజిషన్‌ సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు. సర్పంచు బురుజుల విజయుడుకు తెలియకుండా రెండు నెలల కిందటే వాటిని పంపిణీ చేశారు. ఆ తరువాత ఎవరికీ స్థలాలు కూడా చూపించ లేదు. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన మండల కన్వీనర్‌ గంపల వెంకటేశ్వర్లు వర్గీయులు ఆ స్థలంలో కొలతలు వేసి హద్దులు వేయాలని వెళ్లారు. విషయం తెలుసుకున్న సర్పంచు విజయుడు వర్గీయులు అడ్డు తగిలారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో హద్దులు వేసే ప్రక్రియ ఆగిపోయింది. ఈ క్రమంలోనే సర్పంచ్‌ బురుజుల విజయుడు, పంచాయతీ కార్యదర్శి కలిసి మద్దికెర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గంపల వెంకటేశ్వర్లుకు చెందిన కుమ్మేటి గోపాల్‌, గంపల లక్ష్మన్నలు దౌర్జన్యంగా గ్రామ కంఠ స్థలం ఆక్రమించాలని చూస్తున్నారని ఎస్‌ఐ రమేష్‌బాబు దృష్టికి తెచ్చారు. ఆ స్థలానికి సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Mar 18 , 2024 | 12:38 AM