చంద్రబాబు సభను జయప్రదం చేయాలి: టీడీపీ
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:52 AM
ఈ నెల 9వ తేదీన ఆళ్లగడ్డలో జరిగే నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పిలుపుఇచ్చారు.
![చంద్రబాబు సభను జయప్రదం చేయాలి: టీడీపీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/7_ulw_1f_0a53963953.gif)
ఉయ్యాలవాడ, జనవరి 7: ఈ నెల 9వ తేదీన ఆళ్లగడ్డలో జరిగే నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పిలుపు ఇచ్చారు. ఆదివారం మండలంలోని తుడుమలదిన్నె, ఇంజేడు, ఉయ్యాలవాడ గ్రామాల్లో పర్యటించి టీడీపీ నాయకులను కలిశారు. పుల్లయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కోవెలకుంట్ల మాజీ జడ్పీటీసీ గాండ్ల పుల్లయ్య, మైనారిటీ సెల్ నాయకుడు ఉశేన్వలి, టీడీపీ మండల నాయకులు పేరెడ్డి మోహన్రెడ్డి, గాండ్ల వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఈ నెల 9న చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి కోరారు. పట్టణంలోని ఆయన కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో బెదిరింపు రాజకీయాలు చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అంగన్వాడీలపై ఎస్మా చట్టం అమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో చిన్నకందుకూరు మాజీ సర్పంచు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో ఈనెల 9వ తేదిన జరుగనున్న మాజీ సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి అఖిలప్రియ కోరారు. సభకు హజరయ్యే కార్యకర్తలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
చంద్రబాబు సభకు తాలుకాలోని గిరిజనులందరూ తరలి రావాలని రాష్ట్ర గిరిజన సంఘం ప్రచార కార్యదర్శి నరసింహులు పిలుపు నిచ్చారు. ఈ నెల 9వ తేదిన చంద్రబాబునాయుడు ఆళ్లగడ్డకు వస్తున్నారని, ఆయన పాలనలో గిరిజనులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఆళ్లగడ్డ పట్టణానికి వస్తుండటంతో సభా వేదిక ఏర్పాట్లను ఆదివారం టీడీపీ నాయకుడు గోగిశెట్టి నరసింహారావు పరిశీలించారు. అలాగే టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రుద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం రుద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న ఆళ్లగడ్డ పట్టణంలో రా.. కదలిరా.. సభ నిర్వహస్తున్నట్లు తెలిపారు. నాయకులు రామచంద్రుడు, అశోక్, సాగర్, దాసు, బెనర్జీ, లూథర్బాబు, ఆకాశ్ పాల్గొన్నారు.
చాగలమర్రి: టీడీపీతోనే ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మండల బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు. ఆదివారం చాగలమర్రిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9న చంద్రబాబు ఆళ్లగడ్డకు వస్తున్న సందర్భంగా బీసీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.