సీజన్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో
ABN , Publish Date - Jul 13 , 2024 | 12:08 AM
సీజన్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు.
ఆత్మకూరు, జూలై 12: సీజన్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఆత్మకూరులోని అర్బన్ కాలనీ, కొత్తపేట ఏరియాలను శుక్రవారం ఆయన సందర్శించి ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ప్రత్యేకించి ఆయా కాలనీల్లోని ఇళ్లను పరిశీలించి ఇంటి పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రత్యేకించి ఇంటి పరిసరాల్లో, నీటితొట్టిలు, పూలకుండీల తొట్టిల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ప్రదేశాల నుంచే దోమల వ్యాప్తి జరుగుతోందని వివరించారు. అదేవిధంగా ఏదైనా అరోగ్య సమస్యలు ఉన్నట్లయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి కామేశ్వరరావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, బైర్లూటి పీహెచ్సీ వైద్యులు డాక్టర్ గోపాల్, ఆత్మకూరు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు షాజిదా ఫిర్దోస్ ఉన్నారు.
ఆత్మకూరు రూరల్: జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడంతో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ జిల్లా మలేరియా అఽధికారి డాక్టర్ కామేశ్వరరావు, మండల వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. డెంగీ జ్వరాలు మరింత విస్తరించకుండా పారిశుధ్యంపై దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. డ్రైడేలో భాగంగా ఎంపీడీవో శివప్రసాద్ వర్మతో కలిసి గ్రామంలో దోమల లార్వాల నివారణ కోసం ఖాళీగా ఉన్న డ్రమ్ములు, నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించారు. గ్రామంలో పలు చోట్ల బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ చేయించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ మండలంలోని వైద్య సిబ్బంది ఎప్పటికపుడు గ్రామాలలోని వార్డులలో పర్యటిస్తూ ప్రజల ఆరోగ్యంపై శ్రధ్ద వహించాలని ఆదేశించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, బైర్లూటి పీహెచ్సీ వైద్యాధికారులు గోపాల్, పవన్కుమార్, ఈవోఆర్డి మోహన్కుమార్, సీహెచ్వో అహ్మద్బాషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.