వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:05 AM
రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు సూచించారు.
నంద్యాల (కల్చరల్), మార్చి 27: రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు సూచించారు. ఎండ తీవ్రత వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత వల్ల అప్రమత్తంగా వుంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించి, కళ్లకు రక్షణకోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు. తరచుగా నీటిని త్రాగుతూ ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగాలన్నారు. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు లేక నిమ్మకాయ రసం, కొబ్బరినీరు తాగాల న్నారు. ఎవైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యున్ని సంప్రదిం చాలన్నారు. శఽరీరాన్ని డీహైడ్రేడ్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ శీతల పానీయాలు మానుకోవాలని సూచించారు. ప్రకాశించే బలుపులను వాడవద్దని, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయని తెలిపారు.