అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:31 AM
పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి సోమవారం వచ్చే అర్జీలే కాకుండా సీఎంవో నుంచి డిప్యూటీ సీఎం, మంత్రులు తదితర మార్గాల ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని, వాటన్నింటినీ ప్రాధాన్యతా వారిగా వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ సర్వే మిస్సింగ్ సిటిజన్స్ పీఏసీఎస్సర్వే లాంటి 4, 5 అంశాలపై ఎంపీడీవోలతో ప్రతిరోజూ సమీక్ష చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, కొండయ్య పాల్గొన్నారు.
అర్జీదారులకు వసతులు ఏర్పాటు చేయాలి
అర్జీలు ఇచ్చేందుకు వచ్చే అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా డీఆర్వోను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల కోసం ఏర్పాటు చేసిన వసతులు, అర్జీ కౌంటర్లు, హెల్ప్ డెస్క్లను పరిశీలించారు. అర్జీదారులు కూర్చునేందుకు మరిన్ని చైర్లను ఏర్పాటు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. వికలాంగుల కొరకు ఏర్పాటుచేస్తున్న ర్యాంపులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రెవెన్యూకు సంబంధించి వివిధ రకాల అర్జీలు వస్తుంటాయని, వాటిని సంబంధిత సబ్జెక్టు, ఆప్షన్ల కింద సక్రమంగా నమోదు చేయాలని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు.