Share News

నిత్యం జనంతోనే ఉంటా: ఎమ్మెల్యే జయసూర్య

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:54 PM

ప్రజలకు నిత్యం అందుబాటులో వారి వారికి తలెత్తే సమస్యకు పరిష్కారం చూపుతానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

నిత్యం జనంతోనే ఉంటా: ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, జూన్‌ 6: ప్రజలకు నిత్యం అందుబాటులో వారి వారికి తలెత్తే సమస్యకు పరిష్కారం చూపుతానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ముందుగా నందికొట్కూరులో 20 ఏళ్ల తర్వాత టీడీపీ విజయకేతనం ఎగురవేయడంలో దోహదపడిన నియోజకవర్గంలోని ప్రజలకు, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఆయన సతీమణి మాండ్ర ఉమాదేవికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ప్రజల్లోనే ఉంటూ ఇదేమి ఖర్మ, బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, శంఖారావం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలిచామన్నారు. అంతే కాకుండా నారా లోకేశ్‌ పాదయాత్ర సమయంలో మాండ్ర శివానందరెడ్డి మిడ్తూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెప్పడంతో మిడ్తూరు మండలంలో కలిసి వచ్చిందన్నారు. అలాగే పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కేజీ రోడ్డు విస్తరణ, నియోజకవర్గానికి కంపెనీలను తీసుకొస్తామన్న హామీలతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకొని టీడీపీకి మద్దతు తెలిపారన్నారు. వీటన్నింటికి తోడు స్థానికేతరుడిని వైసీపీ ఎమ్మెల్యేగా తీసుకురావడం, స్థానిక నాయకుల నియంత పోకడతో పట్టణ ప్రజలు విసుగు చెందడంతో టీడీపీ వైపు ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో బంధాలు, స్నేహం తనకు కలిసి వచ్చాయన్నారు. ఇలా ప్రతి అంశం తన గెలుపుకు కలిసి వచ్చాయని జయసూర్య అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:54 PM