కాటసాని అక్రమాలపై కమిటీ వేయాలి
ABN , Publish Date - Mar 04 , 2024 | 11:55 PM
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతి అక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మె ల్యే గౌరు చరిత డిమాండ్ చేశారు.
![కాటసాని అక్రమాలపై కమిటీ వేయాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భూ కబ్జాలు, గ్రావెల్ తవ్వకాలపై నిగ్గు తేల్చాలి
స్పందనలో కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత వినతి
కల్లూరు, మార్చి 4: పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతి అక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మె ల్యే గౌరు చరిత డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో గౌరు చరిత, టీడీపీ నాయకులు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాణ్యం నియో జకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చేస్తున్న భూకబ్జాలు, అక్రమ గ్రావెల్ తవ్వకాలను మీడియా ముఖంగా వెల్లడించామని అన్నారు. అందుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని స్పందిస్తూ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వివరాలు ఉంటే కలెక్టర్కు ఇవ్వాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు. అలాగే భూకబ్జాల ఆరోపణలు నిజమని నిరూపిస్తే తమకు రాసిస్తామని చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలోనే జేసీని కలిసి పాణ్యం ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అక్రమాల వివరాలు అందించామని తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే బాధితులంతా బయటకు వస్తారని, విచారణ జరిపితే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఆక్రమించుకున్న భూములు బాధితులకు అందితే చాలని, తమకు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే కలెక్టరు కమిటీ ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, గుట్టపాడు సర్పంచు మోహన్రెడ్డి, పాలకొలను సుధాకర్రెడ్డి, పుసులూరు ప్రభాకర్ రెడ్డి, మాదేష్, శేఖర్ చౌదరి, రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.