రెండో రోజు 21 నామినేషన్లు..
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:48 PM
సార్వత్రిక సమరానికి పలువురు అభ్యర్థులు సై అంటున్నారు. పోరులో మేము సైతమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
కర్నూలు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక సమరానికి పలువురు అభ్యర్థులు సై అంటున్నారు. పోరులో మేము సైతమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెండో రోజు శుక్రవారం కర్నూలు పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో, ఆర్డీవో రామలక్ష్మికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి, రామ్మోహన్ రెడ్డిలు కూడా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆదోని నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పార్థసారథిరెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను సబ్ కలెక్టర్, ఆర్వో శివ్నారాయణ్ శర్మకు అందజేశారు. ఆయన వెంట టీడీపీ ఇన్చార్జి మీనాక్షినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం, బీజేపీ కన్వీనర్ శ్రీరాములు ఉన్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గౌరు చరిత తరుపున మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి నామినేసన్ పత్రాలను ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్యకు అందజేశారు. మల్లెపురాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులు గుడిసె రామాంజనేయులు, చక్కెర పరమేష్లు నామినేషన్లు వేశారు. కర్నూలు నియోజకవర్గం నుంచి ఆరుగురు, కోడుమూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మురహరిరెడ్డి, ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థి విరుపాక్షి, పత్తికొండ నుంచి ఇండియా కూటమి సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్యలు తమ నామినేషన్ పత్రాలను సంబందిత ఆర్వోలకు అందజేశారు. రెండో రోజు 21 నామినేషన్లు రాగా, రెండు రోజుల్లో 36 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు సంబంధిత ఆర్వోలకు నామినేషన్ పత్రాలు అందజేశారు.