మైలవరంలో వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగ్
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:04 AM
మైలవరంలోకి వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగ్ ప్రవేశించింది. బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ను కొంతకాలం కిందట మూసేశారు. దీనిని వైసీపీ నాయకులు అద్దెకు తీసుకున్నారు. అందులో మంచాలు, ఏసీలు ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితం రాయలసీమలోని కడప, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 70 మంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు.
సూపర్ మార్కెట్ను అద్దెకు తీసుకుని మకాం
సుమారు 70 మందికి అన్ని వసతులతో ఏర్పాట్లు
భయపడిపోతున్న స్థానికులు
వైసీపీ అభ్యర్థి పోల్ మేనేజ్మెంట్ కోసమేనా?
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : మైలవరంలోకి వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగ్ ప్రవేశించింది. బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ను కొంతకాలం కిందట మూసేశారు. దీనిని వైసీపీ నాయకులు అద్దెకు తీసుకున్నారు. అందులో మంచాలు, ఏసీలు ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితం రాయలసీమలోని కడప, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 70 మంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఉదయం వెళ్లడం, రాత్రికి రావడం చేస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి నిలదీశారు. తాము వైసీపీ కార్యకర్తలమని వారు చెప్పడంతో ఖిన్నులయ్యారు. రాయలసీమ వైసీపీ కార్యకర్తలకు ఇక్కడేం పని అని ప్రశ్నించగా, తాము అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వారు వెనుదిరిగారు. వీరు స్థానిక వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు తరఫున పోల్ మేనేజ్మెంట్, డబ్బు పంపిణీ తదితర విషయాలను పర్యవేక్షించేందుకు వచ్చారని సమాచారం. మైలవరం నియోజకవర్గాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఎంత ఖర్చయినా చేయాలని, అవసరమైతే భయపెట్టయినా ఓట్లు వేయించుకోవాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ గ్యాంగులను ఇక్కడికి తీసుకొచ్చారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఫ్యాక్షన్ గ్యాంగ్ మైలవరంలో తిష్ట వేయడంపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధారాల సహా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.