ఓటర్ల జాబితాలో తప్పులను సవరిస్తాం..
ABN , Publish Date - Apr 07 , 2024 | 01:17 AM
జిల్లాలోని ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇంకా 3,078 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనా శనివారం ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
![ఓటర్ల జాబితాలో తప్పులను సవరిస్తాం..](https://media.andhrajyothy.com/media/2024/20240326/collector_b39dc816ec.jpg)
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇంకా 3,078 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనా శనివారం ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు జేసీ గీతాంజలి శర్మ, ఎస్పీ అద్నాన్నయీం అస్మి, ఆర్వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. జిల్ల్లాలో ఇప్పటివరకు రూ.కోటీ37లక్షల వరకూ పట్టుకుని, 79 కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 21 కేసులను పరిష్కరించామని, 43 కేసులు విచారణలో ఉన్నాయని, 15 కేసులు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లఘించిన 17 మంది వలంటీర్లను, ఆరుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని చెప్పారు. సీ-విజల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 483 ఫిర్యాదులు అందగా, వాటిలో 193 సరైనవి కానట్లుగా గుర్తించామన్నారు. 290 ఫిర్యాదులపై విచారణ చేసి, 257 ఫిర్యాదులపై వంద నిమిషాల వ్యవధిలోనే తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ అద్నాన్నయీం అస్మి మట్లాడుతూ జిల్లా సరిహద్దుల వెంబడి 15 చెక్పోస్టులను ఏర్పాటుచేసి నిఘా ఉంచామన్నారు. ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల విలువైన మద్యం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీజర్ మేనేజ్మెంట్ ద్వారా రూ.1.78 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 223 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో మూడు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు అందుబాటులో ఉన్నాయని, మరో 12 కేంద్ర బలగాలు రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.