వేతనాలు పెంచాల్సిందే
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:36 AM
తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని నిరవధిక సమ్మె, రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా శనివారం మచిలీపట్నం రేవతీ టాకీసు సెంటర్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు.
![వేతనాలు పెంచాల్సిందే](https://media.andhrajyothy.com/media/2023/20231205/20mtm04_0fe0380955.jpg)
అంగన్వాడీల దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల రాస్తారోకో
ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మచిలీపట్నం టౌన్, జనవరి 20: తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని నిరవధిక సమ్మె, రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా శనివారం మచిలీపట్నం రేవతీ టాకీసు సెంటర్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, సీఐటీయూ నాయకుడు బి.సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ నాయకుడు లింగం ఫిలిప్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్, ఎన్.కుమారి, వివిధ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెల్లాచెదురు చేశారు. కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సామాజిక న్యాయం అమలంటూ జగన్ ప్రగల్భాలు
గవర్నర్పేట: ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం సభలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రగల్భాలు పలి కారు. అంగన్వాడీల్లో 90 శాతం మంది బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. లక్షకుపైగా ఉన్న అంగన్వాడీలను 40 రోజులుగా సమ్మె చేస్తున్నా వారి న్యాయమైన డిమాండ్లు జగన్ ఎందుకు ఆమోదించలేదు. పెత్తం దార్లు, పేదలకు మధ్య పోరాటం, సామాజిక న్యాయం అంటూ జగన్ మాట్లా డటం హాస్యాస్పదం.’’ అని ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెబుతున్న సామాజిక న్యాయం మాటలు అసత్యాలేనని దీని ద్వారా నిరూపితమైందన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్ద తుగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం లెనిన్ సెంటర్లో ఆందోళన చేశారు. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలని డిమాం డ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, శ్రీనివాసరావు, ప్రసాద్, రవీంద్ర నాథ్, కె.పోలారి, ఎ.రవిచంద్ర, వెంకటసుబ్బయ్య, నారాయణ, కె.దుర్గ, పి.పద్మ, జె.లలిత, ఐ.రాజేష్ను పోలీసులు అరెస్టు చేసి హనుమాన్పేటలోని రాజేశ్వరీ కల్యాణ మంటపానికి తరలించారు.
ఆందోళన ఉద్రిక్తం
నందిగామ: అంగన్వాడీల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీలు శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకోకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచి అంగన్వాడీల కదలికలపై నిఘా పెట్టారు. గాంధీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఈ దశలో వారి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వలయాన్ని ఛేదించుకుని కొందరు అంగన్వాడీలు వై జంక్షన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతి యుత ఉద్యమం చేస్తున్నామని, తమనెందుకు అడ్డుకుం టున్నారని పోలీసులను అంగన్వాడీలు ప్రశ్నించారు. వామ పక్షాల నాయకులు కటారపు గోపాల్, చుండూరు వెంకట సుబ్బారావు మద్దతు తెలిపారు. అనంతరం జాతీయ రహ దారిపై మోకాళ్లపై బైఠాయించి అంగన్వాడీలు నిరసన తెలిపారు.