అంబరాన్నంటిన శిడి సంబరం
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:54 AM
సిరులనిచ్చే వీరమ్మతల్లి శిడిబండి వేడుక వైభవంగా జరిగింది. తిరునాళ్లలో 11వ రోజైన గురువారం శిడిబండి వేడుకను వీక్షించేందుకు భక్తులు అశేషంగా ఉయ్యూరు తరలారు.
ఉయ్యూరు : సిరులనిచ్చే వీరమ్మతల్లి శిడిబండి వేడుక వైభవంగా జరిగింది. తిరునాళ్లలో 11వ రోజైన గురువారం శిడిబండి వేడుకను వీక్షించేందుకు భక్తులు అశేషంగా ఉయ్యూరు తరలారు. కొబ్బరితోట సమీపం నుంచి డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ శిడిబండి బయల్దేరింది. మహిళలు హారతులతో స్వాగతం పలకగా, శివాలయం రోడ్డు, ప్రధాన సెంటర్ మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఆచారం ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఓ కుటుంబంలో వివాహానికి సిద్ధంగా ఉన్న యువకుడికి పూజలు చేసి ఊరేగింపుగా శిడిబండికి కట్టిన ఉట్టి బుట్టలో కూర్చోబెట్టారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఆ తర్వాత పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులు జనసంద్రమయ్యాయి. గన్నవరం డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.