Share News

డ్వాక్రా సభ్యులకు బుక్‌ కీపర్‌ వేధింపులు!

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:05 AM

అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన షాలేమ్‌ డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు మంజూరు కానివ్వకుండా గ్రూప్‌కి చెందిన బుక్‌ కీపర్‌ రత్నకుమారి తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తున్నదని గ్రూపు సభ్యులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

డ్వాక్రా సభ్యులకు బుక్‌ కీపర్‌ వేధింపులు!
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న డ్వాక్రా గ్రూపు సభ్యులు

అవనిగడ్డ, ఫిబ్రవరి 19 : అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన షాలేమ్‌ డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు మంజూరు కానివ్వకుండా గ్రూప్‌కి చెందిన బుక్‌ కీపర్‌ రత్నకుమారి తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తున్నదని గ్రూపు సభ్యులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అవనిగడ్డ స్టేట్‌ బ్యాంక్‌లో షాలేమ్‌ డ్వాక్రా గ్రూపు గత కొన్నేళ్లుగా లోన్లు తీసుకుంటూ, డబ్బులు కడుతూ వస్తున్నామని, ప్రస్తుతం తమ గ్రూప్‌కి 3 లక్షలు మాత్రమే అప్పు ఉందని, కొత్తగా అప్పు కోసం బ్యాంక్‌ వారిని సంప్రదిస్తే లోన్‌ మంజూరు చేయటానికి అంగీకారం తెలిపిన తర్వాత బుక్‌ కీపర్‌ రత్నకుమారి తమకు లోను ఇవ్వకుండా అడ్డుపడుతోందని, లంచం ఇస్తేనే తమకు లోన్‌ మంజూరు చేయనిస్తానని ఖరాకండిగా చెప్పిందని గ్రూపు సభ్యులు ఆరోపించారు. బుక్‌కీపర్‌పై ఫిర్యాదు చేసేందుకు వెలుగు సీసీ, ఏసీల వద్దకు వెళితే సీసీ సువర్ణ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్‌ చేయిస్తేనే లోను మంజూరు చేస్తామని అన్నారన్నారు. ఏసీ రవికుమార్‌ మహిళలు అని కూడా చూడకుండా అసభ్యపదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారన్నారు. తమ గ్రూప్‌ కంటే ఎక్కువ రుణాలు చెల్లించాల్సిన గ్రూపులకు సైతం డబ్బులు ఇస్తే కొత్త లోన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వెలుగు ఏసీ, సీసీ, బుక్‌ కీపర్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేసి షాలేమ్‌ గ్రూపు సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. షాలేమ్‌ గ్రూపు సభ్యులకు స్థానిక తెలుగదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. అయితే దీనిపై వెలుగు సిబ్బంది వాదన వేరుగా ఉంది. షాలేమ్‌ గ్రూపునకు నాలుగున్నర లక్షలకు పైగా లోన్‌ అవుట్‌ స్టాండింగ్‌ ఉందని, లోన్‌ అవుట్‌ స్టాండింగ్‌ ఉన్న వారికి కొత్త లోను ఇవ్వటం సాధ్యపడదని చెబితే బుక్‌ కీపర్‌పైన, సిబ్బందిపైన గ్రూపు సభ్యులు దుర్భాలాడుతూ అసత్య ప్రచారానికి దిగారని ఏరియా కో-ఆర్డినేటర్‌ రవికుమార్‌, సీసీ సువర్ణకుమారిలు తెలిపారు. రాజకీయ కారణాలతోనే తమపై షాలేమ్‌ గ్రూపు సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, లోన్‌ మంజూరు కోసం తాము ఎవరి వద్ద లంచం తీసుకోలేదని బుక్‌ కీపర్‌ చింతా రత్నకుమారి సోమవారం వెలుగు కార్యాలయంలో వివరణ ఇచ్చారు.

Updated Date - Feb 20 , 2024 | 01:05 AM