వెలంపల్లీ.. ఇదేం లొల్లి!
ABN , Publish Date - Jul 15 , 2024 | 01:16 AM
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను గంపగుత్తగా జైప్రకాశ్ వెంచర్స్కు కట్టబెట్టేసింది. కొత్త ఇసుక పాలసీ వచ్చే సమయానికి తీవ్రమైన ఇసుక కొరత నెలకొని భవన నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది.
వెలంపల్లి సోదరుడిపై కేసు పునర్విచారణ
2021లో భవానీపురంలో చీటింగ్ కేసు నమోదు
ఇసుక రీచ్ల సబ్లీజుల పేరుతో పలువురికి టోకరా
సబ్ లీజు కావాలంటూ వెళ్లిన జేపీ వెంచర్స్ ప్రతినిధి
రూ.40 కోట్లు ఇస్తే సబ్ లీజుకు ఇస్తామని బేరం
నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి కేసు పెట్టిన జేపీ వెంచర్స్ ప్రతినిధి
వెలంపల్లి సోదరుడితోపాటు పలువురు బడాబాబుల పేరుతో ఎఫ్ఐఆర్
అప్పటి సీఎం పేషీ నుంచి ఒత్తిళ్లతో పక్కదారి పట్టిన కేసు
అమాయకుడిని ఇరికించేసి బడాబాబులను తప్పించేశారు
తాజాగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన బాధితుడు
కేసును తిరగదోడుతున్న పోలీసులు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను గంపగుత్తగా జైప్రకాశ్ వెంచర్స్కు కట్టబెట్టేసింది. కొత్త ఇసుక పాలసీ వచ్చే సమయానికి తీవ్రమైన ఇసుక కొరత నెలకొని భవన నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇసుకకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారులు రకరకాల ఎత్తుగడలతో రంగంలోకి దిగారు. జేపీ వెంచర్స్ నుంచి ఇసుక క్వారీలను సబ్ లీజుకు తీసుకున్నామని ఆసక్తి కల వ్యక్తులు ముందుకొస్తే వారికి క్వారీలను సబ్ లీజుకు ఇస్తామని గత ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇసుక వ్యాపారులను ఆకర్షించి వారి నుంచి డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం అప్పటికే ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న జైప్రకాశ్ వెంచర్స్కు తెలియడంతో వారి ప్రతినిధి ఒకరు రంగంలోకి దిగారు. 2021 జూన్ 3న జేపీ వెంచర్స్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీశ్ విజయవాడ సమీపానున్న గొల్లపూడిలోని ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసులో కొందరు వ్యక్తులతో సమావేశమయ్యారు. తనను తాను ఇసుక వ్యాపారిగా పరిచయం చేసుకున్నారు. తనకు కృష్ణాజిల్లాలో ఇసుక రీచ్లు సబ్ లీజుకు కావాలని వారిని అడిగారు. దానికి ఆ వ్యక్తులు తమకు రూ.40 కోట్లు ఇస్తే ఇస్తామన్నారు.
వ్యాపారమంతా మాదే..
జేపీ వెంచర్స్ బినామీ కంపెనీ అని ఇసుక వ్యాపారం అంతా తన అన్న వెలంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందని అక్కడే ఉన్న వెలంపల్లి సోదరుడు రఘు సదరు ప్రతినిధికి తెలిపారు. ఇదంతా బోగస్ బాగోతమని అర్థమైన విశ్వనాథన్ సతీశ్ డబ్బులు తీసుకొస్తానని బయటకు వచ్చి నేరుగా భవానీపురం పోలీసుస్టేషన్కు వెళ్లి కేసు పెట్టారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై 2021 జూన్ 4న వెలంపల్లి శ్రీనివాస్ సోదరుడు రఘుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెలంపల్లి రఘుతోపాటు విశాఖపట్నంకు చెందిన వ్యాపారి కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, గుంటూరుకు చెందిన వ్యాపారి మల్లంపాటి శ్రీనివాసరావు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ముక్కొల్లు నాగమల్లేశ్వరరావు, కర్రి సురేంద్రనాథ్ రెడ్డి ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నారు. వీరిలో ప్రవీణ్, శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు వెలంపల్లి శ్రీనివాసరావుకు సన్నిహితులు. వీరిపై 120(బి), 420, 467, 468, 471 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయితే 24 గంటలు గడవకముందే సీను మారిపోయింది. ఈ కేసులో ఉన్నవారంతా వైసీపీ నేతలకు సన్నిహితులు కావడంతో ఆ ఎఫ్ఐఆర్ను పోలీసులు పక్కన పెట్టేశారు. మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఎఫ్ఐఆర్పై చార్జిషీట్ దాఖలు చేయలేదు. పైగా కేసును పక్కదారి పట్టించేందుకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కె.చంద్రశేఖర్రావు అనే వ్యక్తిపై 2021 జూన్ 8న 495/2021 నంబరుతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు మొత్తాన్ని అతనిపైకి నెట్టేశారు.
చంద్రబాబుకు మొరపెట్టుకున్న బాధితుడు
ఈ మొత్తం ఎపిసోడ్లో బాధితుడిగా ఉన్న చంద్రశేఖర్ ఇటీవల సీఎం చంద్రబాబును కలిశారు. వెలంపల్లి సోదరుడు రఘు ఆధ్వర్యంలో జరిగిన ఇసుక చీటింగ్ వ్యవహారాన్ని ఆయనకు వివరించి తనకు న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసును పునర్విచారించేందుకు విజయవాడ పోలీసులు సిద్ధమవుతున్నారు.