వేదవ్యాస్ మాతోనే.. మరో ఆలోచన లేదు
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:52 AM
మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ కూటమితోనే ఉంటారని ఎంపీ, ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం ఉదయం భాస్కరపురంలోని వేదవ్యాస్ ఇంటికి బాలశౌరి వెళ్లారు. వేదవ్యా్సతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
![వేదవ్యాస్ మాతోనే.. మరో ఆలోచన లేదు](https://media.andhrajyothy.com/media/2024/20240407/11mtm01_30420ec461.jpg)
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 11 : మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ కూటమితోనే ఉంటారని ఎంపీ, ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం ఉదయం భాస్కరపురంలోని వేదవ్యాస్ ఇంటికి బాలశౌరి వెళ్లారు. వేదవ్యా్సతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చాలాకాలంగా బూరగడ్డ వేదవ్యాస్, ఆయన తండ్రి బూరగడ్డ నిరంజనరావులు 1967 నుంచి పెడన, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు సేవలందిస్తున్నారన్నారు. కొన్ని కారణాల వల్ల పెడన అసెంబ్లీ సీటు టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ఇచ్చినప్పటికీ వేదవ్యా్సకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు. దీనికోసం చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్లతో చర్చిస్తామన్నారు. రెండురోజుల్లో వ్యాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. వేదవ్యాస్ మాట్లాడుతూ, తనకు అనారోగ్యంగా ఉన్నందున బాలశౌరి పరామర్శకు వచ్చారని.. రాజకీయంగా ఉన్న సమస్యలపై చర్చించామన్నారు. బాలశౌరి తెనాలి ఎంపీగా ఉన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
వైసీపీలో చేరను..
ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశించా
బాలశౌరి హామీ మేరకే తుది నిర్ణయం
- బూరగడ్డ వేదవ్యాస్ వెల్లడి
సీటు రానందున కొందరు నాయకులు తాను వైసీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను వైసీపీలో చేరే ప్రసక్తే లేదని మాజీ ఉపసభాపతి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఆశించానని, అది దక్కకపోవడంతో మానసికంగా అనారోగ్యానికి గురవడం వల్ల చాలారోజుల తరువాత మీడియాతో మాట్లాడుతున్నానన్నారు. పెడన, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలతో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. సీటు కోసం చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ను కలిశానని, అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల తనకు సీటు ఇవ్వలేదన్నారు. రెండు రోజుల్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ను కలిసి తనకు సముచిత స్థానం కల్పిస్తానని బాలశౌరి వాగ్ధానం చేశారని, ఆయన వాగ్ధానాన్ని అనుసరించి ఏ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గ నేతలు, ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని మరచిపోలేనన్నారు.