పొగబెట్టి.. బుజ్జగింపులు!
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:57 AM
‘పార్టీని వీడొద్దు.. కలిసి ప్రయాణం చేద్దాం’ అంటూ వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్కు ఆ పార్టీ నేతలు దేవినేని అవినాశ్, కడియాల బుచ్చిబాబు విజ్ఞప్తి చేశారు. భవకుమార్ పార్టీని వీడుతున్నారన్న సమాచారంతో వైసీపీ పెద్దలు అప్రమత్త మయ్యారు. శనివారం హడావుడిగా దేవినేని అవినాశ్, బుచ్చిబాబును భవకుమార్ వద్దకు పంపారు. ఆయన్ను బుజ్జగించి పార్టీలో కొనసాగాలే చూసేందుకు అవినాశ్, బుచ్చిబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
![పొగబెట్టి.. బుజ్జగింపులు!](https://media.andhrajyothy.com/media/2023/20231205/Rada_1_945e102d00.jpg)
భవకుమార్ ఇంటికి దేవినేని అవినాశ్, బుచ్చిబాబు
వైసీపీని వీడొద్దని బుజ్జగింపులు
టీడీపీలోకి రండి..భవకుమార్కు వంగవీటి రాధా ఆహ్వానం
(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ‘పార్టీని వీడొద్దు.. కలిసి ప్రయాణం చేద్దాం’ అంటూ వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్కు ఆ పార్టీ నేతలు దేవినేని అవినాశ్, కడియాల బుచ్చిబాబు విజ్ఞప్తి చేశారు. భవకుమార్ పార్టీని వీడుతున్నారన్న సమాచారంతో వైసీపీ పెద్దలు అప్రమత్త మయ్యారు. శనివారం హడావుడిగా దేవినేని అవినాశ్, బుచ్చిబాబును భవకుమార్ వద్దకు పంపారు. ఆయన్ను బుజ్జగించి పార్టీలో కొనసాగాలే చూసేందుకు అవినాశ్, బుచ్చిబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నెహ్రూతో కలిసి ప్రయాణం చేసిన తనకు ఆయన కొడుకు అవినాశ్తో కలిసి పనిచేయడం ఇబ్బందేమీ కాదని కానీ అవినాశ్ తనను దూరం పెడుతూ వచ్చారని భవకుమార్ వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినాశ్ వైసీపీలో చేరకముందు నుంచే తాను పార్టీలో ఉన్నానని, తన సీనియార్టీకైనా గౌరవం ఇవ్వకుండా తనను అవమానాలకు గురి చేశారని, అలాంటి పార్టీలో కొనసాగాలనే ఉద్దేశం తనకు లేదని భవకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో గంటకుపైగా భవకుమార్తో భేటీ అయిన అవినాశ్ నిరాశతో వెనుదిరిగారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటూ వైసీపీలో బలో పేతం చేయడానికి తన వంతు కృషి చేశానని, కానీ పార్టీ తనను గుర్తించి పదవిని ఇవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారీ అవినాశ్ వర్గం అడ్డుకుందన్న అభిప్రాయంతో భవకుమార్ ఉన్నారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పదవి దాదాపు ఖరారై జాబి తాలో తన పేరు ఉన్నా చివరి నిమిషంలో దాన్ని మార్పించేశారని, డీసీసీబీ చైర్మ న్గా తనకు అవకాశం లభించాల్సి ఉండగా దాన్నీ అడ్డుకున్నారని సన్నిహితులతో వ్యాఖ్యానించారు. తనకు చాలా అవమానాలు జరిగినా ఏనాడూ బయటపడలేదని, ఇకపై మౌనం సరికాదనే పార్టీని వీడాలన్న నిర్ణయానికి భవకుమార్ వచ్చారు.
త్వరలోనే టీడీపీలో చేరుతా..
భవకుమార్ను టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, వంగవీటి రాధా శనివారం వేర్వేరుగా కలిశారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధా, భవకుమార్ వైసీపీలో తాము ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారికి వైసీపీలో సరైన గుర్తింపు ఉండదని భవకుమార్ వ్యాఖ్యానించారు. త్వరలోనే టీడీపీలో చేరతానని ఆయన రాధాకు స్పష్టం చేశారు.