అనధికార పంపు కనెక్షన్ కోసం రోడ్డు తవ్వేశారు
ABN , Publish Date - Feb 27 , 2024 | 01:16 AM
పేదలు పంపు కనెక్షన్ కావా లంటే సవాలక్ష నిబంధనలతో ఇబ్బంది పెట్టే మునిసిపల్ అధికారులు తమ ఇష్టుల కోసం ఎలాంటి అనుమతులు లేకున్నా ఆగమేఘాలపై పంపు కనెక్షన్లు ఇచ్చేస్తారనడానికి జగ్గయ్యపేట కోదాడ రోడ్డులోని కనపర్తినగర్లో వైదేహి అపార్ట్మెంట్ వద్ద అనధికార పంపు కనెక్షన్ వ్యవహారమే నిదర్శనం.
![అనధికార పంపు కనెక్షన్ కోసం రోడ్డు తవ్వేశారు](https://media.andhrajyothy.com/media/2024/20240224/26jpt5_bbfd46799f.jpg)
జగ్గయ్యపేట మునిసిపల్ సిబ్బంది నిర్వాకం
తెగిపోయిన మునిసిపాలిటీ పైపులైన్.. నిలిచిన నీటి సరఫరా
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 26: పేదలు పంపు కనెక్షన్ కావా లంటే సవాలక్ష నిబంధనలతో ఇబ్బంది పెట్టే మునిసిపల్ అధికారులు తమ ఇష్టుల కోసం ఎలాంటి అనుమతులు లేకున్నా ఆగమేఘాలపై పంపు కనెక్షన్లు ఇచ్చేస్తారనడానికి జగ్గయ్యపేట కోదాడ రోడ్డులోని కనపర్తినగర్లో వైదేహి అపార్ట్మెంట్ వద్ద అనధికార పంపు కనెక్షన్ వ్యవహారమే నిదర్శనం. ఎప్పుడూ కూలీలతో కందకం తవ్వించే సిబ్బంది అనధికార కనె క్షన్ కోసం సోమవారం ఉదయం ఎక్స్కవేటర్ తెప్పించి రోడ్డును ఇష్టారాజ్యంగా తవ్వే శారు. దీంతో రోడ్డుతో పాటు పైపులైన్ పగిలిపోయి నీటి సరఫరా నిలిచిపోయింది. స్థాని కులు ఆగ్రహంతో సిబ్బందిని నిలదీశారు. దీంతో హడావుడిగా రోడ్డుపై తీసిన గుంతను పూడ్చారు. నీటి సరఫరా నిలిచిపోవటంతో ఆ ప్రాంతవాసులు గగ్గోలు పెట్టి మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రకు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ అనధికార వ్యవహారం బయటపడ టంతో ఇంజనీరింగ్ అధికారులు తమకు తెలియదంటే తమకు తెలియదని అంటున్నారు. పంపు కనెక్షన్ ఇచ్చేందుకు రోడ్డు ధ్వంసం చేసి పైపులైన్ పగులగొట్టిన వారిపై పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక నేత చిలకా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు.