పిలిచి నిర్బంధం
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:43 AM
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమీక్ష సమావేశం నుంచి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకు వెళ్ళి జీపుల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. నగర పంచాయతీ పరిధిలో జెమినీస్కూల్ సమీపాన టిడ్కో ఇళ్ళ వద్ద లబ్ధిదారులతో సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
![పిలిచి నిర్బంధం](https://media.andhrajyothy.com/media/2024/20240224/26vij5_fe90aed24c.jpg)
ఉయ్యూరు, ఫిబ్రవరి 26 : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమీక్ష సమావేశం నుంచి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకు వెళ్ళి జీపుల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. నగర పంచాయతీ పరిధిలో జెమినీస్కూల్ సమీపాన టిడ్కో ఇళ్ళ వద్ద లబ్ధిదారులతో సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ ఆహ్వానం మేర నగర పంచాయతీకి చెందిన అధికార పార్టీ వారితో పాటు టీ డీపీ కౌన్సిలర్లు పండ్రాజు సుధారాణి, పరిమి సలోమి సంతోషి, పలియాల శ్రీనివాసరావు, బూరెల రమణ లు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు టీడీపీ నాయకులు సమావేశానికి వెళ్లారు. సమావేశం ప్రారంభం కాక ముందే టీడీపీ కౌన్సిలర్లు, నాయకులపై పోలీసులు జులుంప్రదర్శించి వారిని సమావేశం నుంచి బయటకు ఈడ్చుకు వెళ్లి పోలీసు జీపులు, వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కమిషనర్ ఆహ్వానం మేర వచ్చామని, ఏమితప్పు చేశామని మమల్ని బయటకు తీసుకువెళుతున్నారని టీ డీపీ కౌన్సిలర్లు పోలీసులను ప్రశ్నించి ప్రతిఘటించినప్పటికి పట్టించుకోకుండా లాక్కువెళ్ళి వాహనాలు ఎక్కించారు. సమావేశంలో అలజడి సృష్టిస్తారన్న నెపంతో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు జంపాన గుర్నాధరావు, జంపాన పూర్ణచంద్రరావు, ఖుద్దూస్, కూనపరెడ్డి వాసు, చిరంజీవి, పరిమి భాస్కర్, జగరోతు నాగరాజు, నరేశ్, తదితరులను స్టేషన్కు తీసుకువెళ్లి సమావేశం ముగిసేవరకు నిర్బంధించారు.