Share News

‘తత్వశాస్త్ర మేరు శిఖరం సచ్చిదానందమూర్తి’

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:42 AM

భారతీయ తత్వశాస్త్ర మేరు శిఖరం సచ్చిదానందమూర్తి అని ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవం ఎనిమిదో రోజు గురువారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై తత్వవేత్త పద్మవిభూషణ్‌ కొత్త సచ్చిదానందమూర్తి రచించిన ‘కారుమబ్బులు’ వ్యాససంపుటిని ఆయన ఆవిష్కరించారు.

‘తత్వశాస్త్ర మేరు శిఖరం సచ్చిదానందమూర్తి’

విజయవాడ కల్చరల్‌ : భారతీయ తత్వశాస్త్ర మేరు శిఖరం సచ్చిదానందమూర్తి అని ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. 34వ విజయవాడ పుస్తక మహోత్సవం ఎనిమిదో రోజు గురువారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై తత్వవేత్త పద్మవిభూషణ్‌ కొత్త సచ్చిదానందమూర్తి రచించిన ‘కారుమబ్బులు’ వ్యాససంపుటిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనసులోతుల్లో తలెత్తే వేదనలకు కారణాలు, సమాధానాల వెతుకులాటను బాధ్యతగా చేపట్టి చివరిదాకా కొనసాగించిన తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి అని, తన మనస్సులో తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆ ప్రయత్నంలో చిన్న వయస్సులోనే ప్రపంచంలోని ప్రధాన తాత్విక చింతనలన్నిటినీ అధ్యయనం చేసి వాటిని అందరికీ అర్థమయ్యే రీతిలో రచించి, బోధించిన సచ్చిదానందమూర్తి జాతి గర్వించదగిన తత్వవేత్త అన్నారు. సచ్చిదానంద మూర్తి విశిష్టతను, రచనలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం వుందని ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ, భారతీయ, ఆధ్యాత్మిక, వేదతత్వ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే సచ్చిదానందమూర్తి రచనలు తప్పనిసరిగా చదవాలన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ జంపాల రాజేష్‌ సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్‌ వెలగా జోషి, ప్రొఫెసర్‌ కొత్త రమేష్‌, డాక్టర్‌ సురేంద్ర సభలో పాల్గొన్నారు.

స్ర్తీ హక్కుల కోసం పోరాడిన ధీరవనిత సుధా భరధ్వాజ

విజయవాడ కల్చరల్‌ : జాతీయస్థాయిలో స్ర్తీల హక్కులు, సామాన్యుల కోసం పోరాడిన ధీరవనిత సుధా భరద్వాజ్‌ అని ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే చెప్పారు. గురువారం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించిన ‘సుధా భరద్వాజ’ రచన ‘ఉరి గది నుండి’ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. భారతీయ ప్రజల కోసం ఆమె అమెరికన్‌ పౌరసత్వం వదులుకుని, ఇక్కడ న్యాయవాద వృత్తి చేపట్టారని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి ఉరికి సమాన కారాగార శిక్షకు సిద్ధపడిందని ఆమె వివరించారు. ఒక న్యాయవాదిగా నేరస్థులను కాక, నేరాల వెనుక కారణాలను తెలుసుకొని సమాధానాలకు నిరంతరం ప్రయత్నం చేశారన్నారు. కారాగారంలో ఆడవాళ్ల మనఃస్థితులను ‘ఉరి గది నుండి’ పుస్తకం పూర్తిగా మహిళల కోణంలో విశ్లేషిస్తుందని ఆమె చెప్పారు. సుధా భరద్వాజ్‌ విలువలను అర్ధం చేసుకొని కాపాడాల్సిన అవసరం వుందని ఆమె విజ్ఞప్తి చేశారు. న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, విచారణ ఖైదీలతో భారతీయ జైళ్లు నిండిపోతున్నాయని, వీరిలో అధిక శాతం దళితులు, బహుజనులు వున్నారని వివరించారు. అలాంటి ఖైదీల వెతలను సుధా భరద్వాజ్‌ తన రచనల్లో ప్రతిఫలించారన్నారు. విఠపు బాలసుబ్రమణ్యం, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ పూర్వసంపాదకులు కె.ఉషారాణి, స్వరూపరాణి సభలో పాల్గొన్నారు. కె.లక్ష్మయ్య సభను నిర్వహించారు.

Updated Date - Jan 05 , 2024 | 12:42 AM