ఎన్హెచ్-216 ఆరు వరుసలపై ప్రతిష్టంభన
ABN , Publish Date - May 29 , 2024 | 01:26 AM
విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్హెచ్ - 65) ఆరు లేన్ల విస్తరణ పనులపై సందిగ్ధత నెలకొంది. విజయవాడ తూర్పు బైపాస్ మాదిరిగానే ఈ ప్రాజెక్టు పైనా కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్న విమర్శలు వస్తున్నాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఆరు లేన్లుగా విస్తరించటానికి డీపీఆర్ రూపకల్పన దాదాపుగా పూర్తయినా కేంద్రం ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. దీంతో విజయవాడ - మచిలీపట్నం రోడ్డు ఆరు వరసల విస్తరణ అంశంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
![ఎన్హెచ్-216 ఆరు వరుసలపై ప్రతిష్టంభన](https://media.andhrajyothy.com/media/2024/20240511/road_6b242a5675.jpg)
విజయవాడ - మచిలీపట్నం ఆరు వరుసల విస్తరణపై కేంద్రం శీతకన్ను
ఎన్హెచ్ - 216 హెచ్ విస్తరణ ఆలోచనతోనే వెనకడుగు
మచిలీపట్నం పోర్టుకు అనుసంధానంగా
ఎన్హెచ్ - 216 , 216 హెచ్లను వాడాలని యోచన
విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్హెచ్ - 65) ఆరు లేన్ల విస్తరణ పనులపై సందిగ్ధత నెలకొంది. విజయవాడ తూర్పు బైపాస్ మాదిరిగానే ఈ ప్రాజెక్టు పైనా కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్న విమర్శలు వస్తున్నాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఆరు లేన్లుగా విస్తరించటానికి డీపీఆర్ రూపకల్పన దాదాపుగా పూర్తయినా కేంద్రం ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. దీంతో విజయవాడ - మచిలీపట్నం రోడ్డు ఆరు వరసల విస్తరణ అంశంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బందరు పోర్టు నిర్మాణ పనుల నేపథ్యంలో విజయవాడ - మచిలీపట్నం రోడ్డు ఆరు వరసలు అవుతుందనుకుంటే అది కాస్తా వెనక్కుపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏమీ తేల్చకపోవటంతో ప్రతిష్టంభన నెల కొంది. విజయవాడ తూర్పు బైపాస్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబిస్తోంది. విజయవాడ తూర్పు బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు భవితవ్యంపై ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండా కేంద్రం ప్రతిష్టంభనలో పడవేసింది. ఇదే పరిస్థితి విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి ఆరు వరసల విస్తరణపై కూడా నెలకొన్నట్టుగా తెలుస్తోంది.
ఖమ్మంతో కనెక్టివిటీపై ఆలోచన
మచిలీపట్నం పోర్టును నేరుగా తెలంగాణా రాష్ట్రంతో అనుసంధానించటానికి వీలుగా ఖమ్మం జిల్లా - మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీని కోసం ఎన్హెచ్ - 216హెచ్పై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఎన్హెచ్ - 216 హెచ్ అనేది ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు తిరిగి ఇక్కడి నుంచి గుడివాడ వరకు అనుసంధానం అవుతుంది. ఈ ఎన్హెచ్ 216 హెచ్ మార్గమధ్యలో కత్తిపూడి - ఒంగోలు వెళ్లే ఎన్హెచ్ - 216 కూడా కలుస్తుంది. కాబట్టి ఈ ఎన్హెచ్ - 216 హెచ్, ఎన్హెచ్ - 216లను ఆరు వరసలుగా విస్తరించటం ద్వారా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే విజయవాడ - మచిలీపట్నం బైపాస్ రోడ్డు అంశంలో ప్రతిష్టంభన ఏర్పడినట్టుగా తెలుస్తోంది.