నరకం చూపిన ఆసరా సంబరం
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:52 AM
నాల్గవ విడత ఆసరా సంబరాల కార్యక్రమం డ్వాక్రా మహిళలకు నరకాన్ని చూపింది. మండలంలో సుమారు 7600 మందికిపైగా ఉన్న డ్వాక్రా మహిళలను ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఐదువేలకు తగ్గకుండా ఆసరా సంబరాల కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ప్రజాప్రతినిధులు, నేతలు వెలుగు సిబ్బందికి హుకుం జారీ చేయడంతో బుక్ కీపర్లు, వీవోఏలు పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించారు. అయితే గురువారం టీటీడీ కళ్యాణమండపంలో నిర్వహించిన ఆసరా సభలో తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో మహిళలు నరకాన్ని చవిచూశారు.
![నరకం చూపిన ఆసరా సంబరం](https://media.andhrajyothy.com/media/2023/20231205/1cp08_59dec76eb1.jpg)
అవనిగడ్డ, ఫిబ్రవరి 1 : నాల్గవ విడత ఆసరా సంబరాల కార్యక్రమం డ్వాక్రా మహిళలకు నరకాన్ని చూపింది. మండలంలో సుమారు 7600 మందికిపైగా ఉన్న డ్వాక్రా మహిళలను ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఐదువేలకు తగ్గకుండా ఆసరా సంబరాల కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ప్రజాప్రతినిధులు, నేతలు వెలుగు సిబ్బందికి హుకుం జారీ చేయడంతో బుక్ కీపర్లు, వీవోఏలు పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించారు. అయితే గురువారం టీటీడీ కళ్యాణమండపంలో నిర్వహించిన ఆసరా సభలో తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో మహిళలు నరకాన్ని చవిచూశారు. కనీసం కూర్చీలు, తాగునీరు అందుబాటులో లేకుండా గొర్రెల మందను తోలినట్టు తమను కళ్యాణ మండపంలో కుక్కి అధికారులు వేడుక చూడటం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతుండగానే వెనుతిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా వైసీపీ నేతలు మహిళలను బయటకు వెళ్లకుండా గేట్లు మూసేయటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలుపులు తోసుకుని మరీ గుంపులుగా బయటికి వెళ్లిపోయారు. నాల్గవ విడత ఆసరాలో భాగంగా మండలంలో లబ్ధిదారులకు రూ.9.35 కోట్ల చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమే్షబాబు ప్రారంభించారు. పార్టీ నేతలంతా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కార్యక్రమాన్ని రాజకీయ సభగా మార్చివేయటంతో ఇందుకోసమేనా? బలవంతంగా తరలించారని మహిళలు అసహనం వ్యక్తం చేశారు.