అర్ధరాత్రి అక్రమాలు
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:41 AM
‘అక్రమార్జనకు సమయంతో పనేముంది.. పగలైతే అందరికీ సమాధానం చెప్పుకోవాలి.. దొంగచాటుగా వ్యవహారాలు నడపాలి.. అర్ధరాత్రయితే ఏ సమస్యా లేదు.. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పనీ లేదు..’ అనుకుంటున్న మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు అర్ధరాత్రి ముహూర్తాన్ని నిర్ణయించుకుంది. పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని గత టీడీపీ ప్రభుత్వం జక్కంపూడి, వేమవరం ప్రాంతాల్లోని భారీ గోతులను గ్రావెల్తో చదునుచేయగా, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఆ గోతుల్లోని మట్టిని తవ్వి తీసుకెళ్లిపోతున్నారు. పగలైతే స్థానికులు అడ్డుకుంటున్నారని.. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్ల విలువైన గ్రావెల్ను మింగేస్తున్నారు.
![అర్ధరాత్రి అక్రమాలు](https://media.andhrajyothy.com/media/2024/20240215/Mining_in_vemavaram_5_dfdace81bf.jpg)
జక్కంపూడి, వేమవరంలో నిశిరాత్రిలో అక్రమ తవ్వకాలు
పగలైతే గ్రామస్థులు అడ్డుకుంటున్నారని రాత్రిపూట..!
అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న మాఫియా
టిడ్కో ఇళ్ల నిర్మాణం నిమిత్తం పూడ్చిన గోతులపై కన్ను
టీడీపీ హయాంలో భారీగా గోతుల పూడ్చివేత
అందులోని గ్రావెల్ను తవ్వేస్తున్న మాఫియా
గురువారం అర్ధరాత్రి అడ్డుకున్న స్థానికులు
లెక్కచేయకుండా తవ్వకాలు జరిపిన అక్రమార్కులు
అధికార పార్టీ అండ ఉందని రుబాబు
తూతూమంత్రంగా దాడులు చేసిన అధికారులు
‘అక్రమార్జనకు సమయంతో పనేముంది.. పగలైతే అందరికీ సమాధానం చెప్పుకోవాలి.. దొంగచాటుగా వ్యవహారాలు నడపాలి.. అర్ధరాత్రయితే ఏ సమస్యా లేదు.. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పనీ లేదు..’ అనుకుంటున్న మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు అర్ధరాత్రి ముహూర్తాన్ని నిర్ణయించుకుంది. పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించి ఇద్దామని గత టీడీపీ ప్రభుత్వం జక్కంపూడి, వేమవరం ప్రాంతాల్లోని భారీ గోతులను గ్రావెల్తో చదునుచేయగా, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఆ గోతుల్లోని మట్టిని తవ్వి తీసుకెళ్లిపోతున్నారు. పగలైతే స్థానికులు అడ్డుకుంటున్నారని.. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్ల విలువైన గ్రావెల్ను మింగేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రూరల్ మండలంలో టిడ్కో ఇళ్లను నిర్మించేందుకు చదును చేసిన మట్టిని కూడా మైనింగ్ మాఫియా తన్నుకుపోతోంది. అది కూడా అర్ధరాత్రిపూట. పేద, మధ్య తరగతి వర్గాల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో జక్కంపూడి, వేమవరం కొండ ప్రాంతాల్లో టిడ్కో ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. ఇళ్ల నిర్మాణాల కోసం దిగువ ప్రాంతంలో ఉన్న గోతులను చదును చేయించారు. ఈ ప్రాంతంలో ఇళ్లు ఇంకా నిర్మించాల్సి ఉండగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పని చేయలేదు. పైగా గ్రావెల్ను తరలించుకుపో మని ఆ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియాకు అప్పగించింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవటానికి జిల్లా యంత్రాంగానికి వెన్నులో వణుకు పుడుతోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే మాఫియాకు అడ్డుచెప్పే సాహసం ఎవరూ చేయలేకపో తున్నారు. పొరుగు జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ ఎంపీకి చెందిన అనుచరులు సాగిస్తున్న ఈ దాష్టీకాన్ని లోకాయుక్త, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితికి చేరింది.
పగలైతే కుదరదని..
అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక గ్రామస్థులు మాత్రం రెండు నెలలుగా ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకుంటున్నారు. ఫలితంగా అక్రమార్కులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో మైనింగ్ మాఫియా కూడా కొత్త ఎత్తులు వేసింది. గ్రామస్థులు అడ్డుకుంటున్నారన్న ఉదే ్దశంతో రూటు మార్చింది. అందరూ గాఢనిద్రలో ఉండే సమయంలో మైనింగ్ చేపడుతున్నారు. జక్కంపూడి, వేమవరం కొండ దిగువన పేద, మధ్య తరగతి వర్గాలకు బహుళ అంతస్థుల టిడ్కో ఇళ్లను నిర్మించేందుకు టీడీపీ హయాంలో పూడ్చిన గోతులను అర్ధరాత్రి పూట తవ్వేస్తున్నారు. అప్పట్లో వేమవరం కొండ దిగువన గోతుల్లో దాదాపు లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను నింపి చదును చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన మాఫియా తెలివిగా ఆ గోతులను తవ్వుకోవాలని స్కెచ్ వేసింది. పగలంతా గ్రామానికి శివారున తోటల్లో ఎక్స్కవేటర్లను దాచి, అర్ధరాత్రి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మెండెం జమలయ్య నేతృత్వంలోని స్థానికులు కొందరు గురువారం అర్ధరాత్రి వేమవరం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గతంలో పూడ్చిన గోతులను తవ్వి లారీల్లోకి ఎక్కిస్తుండటాన్ని గుర్తించారు. వేమవరం కొండగట్టు ప్రాంతంలో నాలుగు భారీ ఎక్స్కవేటర్లతో గోతులను తవ్వేసి, భారీ టిప్పర్లలోకి మట్టిని లోడ్ చేస్తుండటాన్ని వారంతా చూశారు. ఒక్కో మిషన్ దగ్గర పది లారీలు, దాదాపు 50కు పైగా పెద్ద టిప్పర్లు వరుసలో ఉంచడానికి గుర్తించారు.
గ్రామస్థులు అడ్డుకున్నా బేఖాతరు
స్థానికంగా గ్రామస్థులు అడ్డుకున్నా మైనింగ్ మాఫియా ప్రతిఘటించింది. ఎక్స్కవేటర్లను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఖాతరు చేయలేదు. అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయన త్వరలో తనిఖీలు కూడా చేస్తారని హెచ్చరించినా వినలేదు. ‘నువ్వు కలెక్టర్కు చెబితే మేము ప్రభుత్వానికి చెప్పాం. మా వెనుక మంత్రులు ఉన్నారు.’ అంటూ రుబాబు చేశారు. దీంతో స్థానికులంతా చేష్టలుడిగి చూడటం తప్ప తవ్వకాలను అడ్డుకోలేకపోయారు. వీడియోలు తీసి మైనింగ్ అధికారులకు పంపించారు.
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
అర్ధరాత్రుళ్లు మైనింగ్ జరుగుతున్న వ్యవహారాన్ని స్థానికులు.. రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వారు పట్టించుకోలేదు. స్థానిక ఆర్ఐ హరీష్ స్పందించలేదు. మైనింగ్ డీడీ, ఏడీ సెలవులో ఉన్నారు. వీరు సెలవు పెట్టడానికి మైనింగ్ మాఫియానే కారణమని తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు.. తమ సిబ్బందిని పంపిస్తామని చెప్పిన అధికారులు కొన్ని గంటల తర్వాత వేమవరం కాకుండా వేరే ప్రాంతానికి పంపించారు. రెవెన్యూ అధికారుల అలెర్ట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందుకున్న మైనింగ్ మాఫియా ఆ సమయంలో తవ్వకాలు ఆపింది. మైనింగ్ సిబ్బంది వచ్చి చూసి వెళ్లిపోయారు. కళ్లెదుట వ్యవస్థలే ఇలా ప్రవర్తిస్తుంటే, తమ పోరాటం వృథానే అనుకుని గ్రామస్థులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు.