అంతర్జాతీయస్థాయి గోల్ఫ్ కోర్సుకు స్థలాన్వేషణ!
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:11 AM
ఆంధ్రప్రదేశ్ను క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు క్రీడలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా అమరావతిలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
పరిశీలనలో మూలపాడు, కొండపల్లి, భవానీద్వీపం
అమరావతిలోనూ సాగుతున్న స్థలాన్వేషణ
2 ఏళ్లలో ఏర్పాటుకు కసరత్తు
సుమారు 150 ఎకరాలు అవసరం
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ను క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు క్రీడలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా అమరావతిలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో అమరావతి ప్రాంతం హైదరాబాద్ను మించి అభివృద్ధి చెందుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రాంతంలో అన్ని రంగాల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. గోల్ఫ్ కోర్సు ఏర్పాటు కూడా అందులో భాగమే. గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్వేషణ ప్రారంభించారు. నాలుగైదు అనువైన ప్రాంతాలను గుర్తించి, సీఎం తుది ఆమోదం తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
కొద్ది రోజుల క్రితం ప్రముఖ క్రికెటర్, గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కపిల్దేవ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో రాష్ట్రంలో గోల్ఫ్ క్రీడను అభివృద్ధి చేయడంపై ఇరువురూ చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సు క్లబ్ను ఏర్పాటు చేయాలని ఈ భేటీలో సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో అనంతపురం, విశాఖపట్నంలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్సు క్లబ్బులను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కపిల్దేవ్తోపాటు విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్(చిన్ని) కూడా ఉన్నారు. గోల్ఫ్ కోర్సు ఎక్కడ ఏర్పాటు చేయాలి.. ఎంత మేర స్థలం అవసరం అవుతుంది.. ఎక్కడ స్థలం అందుబాటులో ఉంది అన్న విషయాల బాధ్యతను కేశినేని చిన్నికి అప్పగించారు.
నాలుగు చోట్ల పరిశీలన
అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయాలంటే కనీసం 150 ఎకరాలు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో స్థలం ఎక్కడ అందుబాటులో ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. భవానీద్వీపం చెంతనే ఉన్న ద్వీపాల్లో విస్తీర్ణం పరంగా పెద్దగా ఉన్న ద్వీపాన్ని పరిశీలించగా, అక్కడ వరద ముప్పు ఉంటుందని, ఖరీదైన గోల్ఫ్ కోర్సు తరచూ ముంపు బారిన పడితే నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో భవానీద్వీపం ఆప్షన్ను పక్కన పెట్టేశారు. కొండపల్లి, మూలపాడు ప్రాంతాల్లో భూముల లభ్యత సరిపడా ఉందని, అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇబ్రహీపంపట్నం వద్ద కృష్ణానదిలో నిర్మిస్తున్న వంతెన పూర్తయితే రాజధాని ప్రాంతానికి కూడా ఈ ప్రాంతాలు చేరువలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలో కూడా పలు స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే మున్ముందు అమరావతిలో భూ అవసరాలు చాలా ఉంటాయని, ఇక్కడ భూమి ధర కూడా భారీగా ఉంటుందనే ఉద్దేశంతో మూలపాడు, కొండపల్లి వైపు అధికారులు మొగ్గుచూపుతున్నారు. కొద్దిరోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
క్రీడాంధ్రగా తీర్చిదిద్దుతాం : కేశినేని చిన్ని
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చింది. యువతను గంజాయి మత్తులో ముంచేసింది. మా ప్రభుత్వం యువతను క్రీడల వైపు మళ్లించి రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారాల్చన్న ఆలోచనతో ముందుకు వెళుతోంది. మన దేశంలో గోల్ఫ్కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లభిస్తోంది. రాష్ట్రంలో గోల్ఫ్ను ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. అనంతపురంలో కియా ఉద్యోగులు చాలామంది గోల్ఫ్ కోసం బెంగుళూరు వెళ్లి వస్తున్నారు. అమరావతి కూడా మున్ముందు గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు గోల్ఫ్కు డిమాండ్ బాగా పెరుగుతుంది. క్రికెట్లో ఐపీఎల్ మాదిరి గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లు నిర్వహించాలన్న ఆలోచన కూడా ఉంది. గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో ఏపీ నుంచి ఒక టీం ఉండాలన్నది మా ఆకాంక్ష. రెండేళ్లలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.