కోట్లలో.. దుర్గగుడి షాపుల అద్దె బకాయులు!
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:05 AM
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థలంలో అద్దె ప్రాతిపదికన లీజులకు తీసుకుని షాపుల నడుపుతున్న నిర్వాహకులు సుమారు రూ.1.80 కోట్లకు పైగానే అద్దె బకాయిలున్నట్టు తెలుస్తోంది. అధికారుల ఉదాసీన వైఖరితోనే నిర్వాహకులు అద్దెను వాయిదాలు వేస్తున్నట్టు సమాచారం.
వన్టౌన్, జనవరి 28 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థలంలో అద్దె ప్రాతిపదికన లీజులకు తీసుకుని షాపుల నడుపుతున్న నిర్వాహకులు సుమారు రూ.1.80 కోట్లకు పైగానే అద్దె బకాయిలున్నట్టు తెలుస్తోంది. అధికారుల ఉదాసీన వైఖరితోనే నిర్వాహకులు అద్దెను వాయిదాలు వేస్తున్నట్టు సమాచారం. దేవస్థానం వేలంపాటలో కనకదుర్గానగర్లో రెండేళ్ల క్రితం 24 షాపులకు గాను 21 షాపులు నిర్వాహకులు లీజుకు తీసుకున్నారు. ఒక్కో షాపునకు సుమారు నెలకు అద్దె రూ 90 వేలు, జీఎస్టీ మరో 16వేలు కలిపి మొత్తంగా రూ. 1.06 లక్షల మేరకు అద్దె ఖరారుతో వేలం పాడుకున్నారు. కొన్ని నెలలు సజావుగా అద్దె చెల్లించిన నిర్వాహకులు అనంతరం వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు బకాయిలు సుమారు రెండు కోటకు చేరినట్టు విశ్వసనీయ సమాచారం. అద్దె వసూళ్లలో దేవస్థానం అధికారులు ఉదాసీన వైఖరి చూపుతున్న ట్టు తెలుస్తోంది. మహా మండపంలో ఐదు షాపులు ఉండగా, మూడు షాపుల నిర్వాహకులు మూడు నెలలుగా అద్దె చెల్లించట్టు తెలుస్తోంది. అధికారులు నోటీసులు ఇచ్చినా నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై సంబంధిత షాపుల విభాగ పర్యవేక్షకుడు ఏఈవో సీసీ రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని, బకాయిల చెల్లింపులో నిర్వాహకులు స్పందించకపోతే ఈవో, ట్రస్ట్బోర్డు చైర్మన్ల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.