జగన్ ఐదేళ్ల పాలన కూల్చివేతలు-కుట్రలు-కేసులే..
ABN , Publish Date - Apr 04 , 2024 | 12:50 AM
కూల్చి వేతలు, కుట్ర కేసులు, కక్ష సాధింపులతో ఐదేళ్ల జగన్ పాలన సాగిందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ విమర్శించారు.
![జగన్ ఐదేళ్ల పాలన కూల్చివేతలు-కుట్రలు-కేసులే..](https://media.andhrajyothy.com/media/2024/20240326/3nandigama1_d95a6d97ca.jpg)
నందిగామ, ఏప్రిల్ 3: కూల్చి వేతలు, కుట్ర కేసులు, కక్ష సాధింపులతో ఐదేళ్ల జగన్ పాలన సాగిందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ విమర్శించారు. నందిగామ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచార కార్యక్రమం బుధవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్టెం మాట్లాడుతూ రాజధాని గురించి ప్రశ్నిస్తే దాడులు చేసి ప్రజలను గాయపరచడం హేయమన్నారు. ఇటువంటి సంస్కృతికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎమ్మెల్యేగా సౌమ్యకు, ఎంపీగా కేశినేని చిన్నికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు రూపకల్పన చేశారన్నారు. కూటమి విజయం రాష్ట్రాభివృద్ధికి మార్గమన్నారు. పెద్దయెత్తున టీడీ పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏసీపీకి వినతిపత్రం
తెలుగుదేశం సానుభూతి పరులపై దాడులు చేసిన వైసీపీ అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపీ డాక్టర్ రవికిరణ్ను కోరారు. నెట్టెం రఘురామ్, తంగిరాల సౌమ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోట వీరబాబు, నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్, శాఖమూరి స్వర్ణలత, కొండ్రగుంట శ్రీనివాస్కుమార్, తదితరులు ఏసీపీని కలిశారు. సీసీ కెమెరా దృశ్యాలు కూడా నమోదై ఉన్నందున తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలనూ పరిశీలించి న్యాయం చేస్తానని ఏసీపీ డాక్టర్ రవికిరణ్ హామీ ఇచ్చారు.