ప్రశ్నిస్తే కేసులా..?
ABN , Publish Date - Mar 16 , 2024 | 01:31 AM
గంపలగూడెం మండలంలో రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీకి ఊడిగం చేస్తోంది. వైసీపీ నేతలు సాగిస్తున్న అక్రమాలను ప్రశ్నించిన వారిపై అధికారులే కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నది వైసీపీ నాయకులే అయినా కూడా వదలట్లేదు. వైసీపీ గంపలగూడెం నాయకుల అక్రమాలపై అదే పార్టీకి చెందిన మండలస్థాయి నాయకుడు నాగరాజు కొంతకాలంగా పోరాడుతున్నారు.
![ప్రశ్నిస్తే కేసులా..?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గంపలగూడెం మండలంలో రెవెన్యూ అధికారుల స్వామిభక్తి
ప్రశ్నించిన వైసీపీ నాయకుడిపై కేసు పెట్టే కుట్ర
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గంపలగూడెం మండలంలో రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీకి ఊడిగం చేస్తోంది. వైసీపీ నేతలు సాగిస్తున్న అక్రమాలను ప్రశ్నించిన వారిపై అధికారులే కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నది వైసీపీ నాయకులే అయినా కూడా వదలట్లేదు. వైసీపీ గంపలగూడెం నాయకుల అక్రమాలపై అదే పార్టీకి చెందిన మండలస్థాయి నాయకుడు నాగరాజు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి అనుచరులు సాగిస్తున్న అక్రమాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాల యంలోని స్పందనలో కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పెదకొమెరలో వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు సాగించిన నకిలీ పట్టాల ఉదంతంపై కూడా పోరాడారు. అనర్హులకు ఇళ్ల పట్టాల అంశంపైనా, స్థానికంగా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపైనా తరచూ అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోమని కోరారు. ఇటీవల కాలంలో కట్టలేరులో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఇందుకు రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. వీటిపై నాగరాజు ఫిర్యాదులు చేస్తు న్నారు. దీంతో గంపలగూడెం రెవెన్యూ అధికారులు శుక్రవారం స్థానిక పోలీసులను కార్యాలయానికి పిలిచి నాగరాజుపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరినట్టుగా తెలిసింది. అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకుడిపై కేసు ఎలా పెట్టాలో తెలియక.. తన విధులకు ఆటంకం కలిగిస్తున్నాడన్న నెపంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్ఐ దగ్గర తహసీల్దార్ కోరినట్టు సమాచారం. అయితే, ఇదంతా నాగరాజును బెదిరించడానికేనని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని తెలిసింది.