Share News

దుర్గమ్మకు భద్రత ఎంత?

ABN , Publish Date - Aug 11 , 2024 | 12:54 AM

దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో భద్రత కొరవడిందనడానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. దుర్గగుడిలో ఓ భక్తుడు అంతరాలయ చిత్రాలను సెల్‌ ఫోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో దృశ్యాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

దుర్గమ్మకు భద్రత ఎంత?
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న దుర్గగుడి అంతరాలయ దృశ్యాలు

నిఘా లోపమే అంటున్న భక్తులు

ఆలయంలోకి సెల్‌ఫోన్ల నిషేధంపై చర్యలేవీ

వన్‌టౌన్‌, ఆగస్టు 10 : దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో భద్రత కొరవడిందనడానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. దుర్గగుడిలో ఓ భక్తుడు అంతరాలయ చిత్రాలను సెల్‌ ఫోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో దృశ్యాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. శుక్రవారం వీడియో తీసినట్టుగా తెలుస్తోంది. అంతరాలయంలోని అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో విడుదల చేస్తూ శుక్రవారం అమ్మవారి వైభోగాన్ని చూడండి.. అంటూ క్యాప్షన్‌ పెట్టారు. బహిరంగంగా అంతరాలయంలో అమ్మవారిని వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న అధికారులు, సెక్యూరిటీ ఏం చేస్తోందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. అధికారులు, సెక్యూరిటీ అందరూ ఉన్నా కూడా ఆలయంలో జరుగుతున్నదానిపై దృష్టి పెట్టడం లేదనేది ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం అమ్మవారి అంతరాలయ దృశ్యాలు చిత్రీకరించకూడదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ క్రమంలో అమ్మవారి ఆలయంలో ఎవరూ చిత్రీకరించకూడదు. పైగా ఆలయంలోకి సెల్‌ ఫోన్‌లు నిషేధం ఉన్నప్పటికీ చాలామంది సెల్‌ ఫోన్లతో వస్తున్నారు. తనిఖీల్లో డొల్లతనం కారణంగానే అమ్మవారి అంతరాలయ దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తరించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయం వద్ద విధులు నిర్వహించే సూపరింటెండెంట్‌లు, ఏఈవోలు, ప్రైవేటు సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది, అర్చకులు అంతా చిన్న ప్రాంతంలోనే కిక్కిరిసి ఉంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోయారన్నది ప్రశ్నగా ఉంది. గతంలో కూడా ఓ మహిళ అంతరాలయ దృశ్యాలను చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పెట్టింది. తరువాత ఆమెను గుర్తించారు కానీ, చర్యలు తీసుకోకపోవటంతో ఇలాంటివి పునరావృతమవుతున్నాయి. దుర్గగుడిలో భద్రతా చర్యలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 12:54 AM