దుర్గగుడి సేవా కౌంటర్లలో ఈవో తనిఖీలు
ABN , Publish Date - Mar 18 , 2024 | 01:18 AM
దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా, విరాళాల కౌంటర్, టోల్ఫ్రీ, దర్శనం కౌంటర్లను ఆదివారం సాయంత్రం ఈవో కేఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవల కౌంటర్లో వివిధ పూజల టికెట్లు ఏ మేరకు జరుగుతున్నాయి, విరాళాల కౌంటర్లో వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని సిబ్బందిని ఈవో అడిగి తెలుసుకున్నారు.
![దుర్గగుడి సేవా కౌంటర్లలో ఈవో తనిఖీలు](https://media.andhrajyothy.com/media/2024/20240313/ramu26_2fa2c3aa70.jpg)
వన్టౌన్, మార్చి 17 : దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా, విరాళాల కౌంటర్, టోల్ఫ్రీ, దర్శనం కౌంటర్లను ఆదివారం సాయంత్రం ఈవో కేఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవల కౌంటర్లో వివిధ పూజల టికెట్లు ఏ మేరకు జరుగుతున్నాయి, విరాళాల కౌంటర్లో వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని సిబ్బందిని ఈవో అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారులతో చైర్మన్ వాగ్వివాదం
దేవస్థానం అధికారులతో ట్రస్ట్బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆదివారం వాగ్వాదానికి దిగారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు ట్రస్ట్బోర్డు చైర్మన్ కార్యాలయానికి శనివారం రాత్రి తాళంవేసి అందులో పనిచేస్తున్న సిబ్బందిని అంతర్గత బదిలీచేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన చైర్మన్ కార్యాలయానికి తాళం వేసి ఉండడాన్ని గమనించి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దేవస్థాన అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరి అని గతంలో కూడా ఎన్నికల కోడ్ అమలు పరిచామని చెప్పడంతో చైర్మన్ వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ వ్యవహారాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లగా ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని చెప్పడంతో చైర్మన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.