మోదీ ప్రభుత్వ ఓటమితోనే దేశానికి రక్ష
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:49 AM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అదే దేశానికి, ప్రజలకు రక్ష అని పలు కార్మిక, రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
![మోదీ ప్రభుత్వ ఓటమితోనే దేశానికి రక్ష](https://media.andhrajyothy.com/media/2024/20240215/DSC_3490_c47f2b09d1.jpg)
కార్మిక, రైతాంగ నేతల వ్యాఖ్యలు
గవర్నర్పేట, ఫిబ్రవరి 16: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అదే దేశానికి, ప్రజలకు రక్ష అని పలు కార్మిక, రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె సందర్భంగా శుక్రవారం కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రద ర్శన నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అక్కడ నిర్వహించిన సభలో పలువురు రైతు, కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. ‘‘రైతు ఉద్యమం కారణంగా మూడు నల్ల చట్టాలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం, రైతాంగానికి ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఆయన చేసిన సిఫార్సులను అమలు చేయడం లేదు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీ కరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది.’’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. ‘‘నూతన విద్యా విధానం పేరిట విద్యా వ్యవస్థను ధ్వంసం చేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోంది. కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తెచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజానీకం అల్లాడుతున్నా వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్ట లేదు.’’ అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్రనాథ్ పేర్కొన్నారు. బీజేపీని దానికి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.పొలారి పిలుపునిచ్చారు. సీఐటీయూ నేత కె.దుర్గారావు, పీడీఎస్యూ నేత ఎ.రవిచంద్ర, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, ఏఐ యూటీయూసీ నాయ కులు కె.సుధీర్, దివాకర్, కార్మిక సంఘాల నేతలు పి.అజయ్కుమార్, సీహెచ్ బాబూరావు, ఎ.వెంకటేశ్వరరావు, ఆర్.అజయ్కుమార్, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.