త్యాగరాజ స్వామి ఆరాధనా సంగీతోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:33 AM
సంగీతం సాహిత్యంతో భక్తిని మేళవించి సామాజిక హితాన్ని బోధించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి అని ప్రముఖ సంగీత విద్వాంసులు ఎనమండ్ర శ్రీనివాసశర్మ అన్నారు.
త్యాగరాజ స్వామి ఆరాధనా సంగీతోత్సవాలు ప్రారంభం
విజయవాడ కల్చరల్, జనవరి 29 : సంగీతం సాహిత్యంతో భక్తిని మేళవించి సామాజిక హితాన్ని బోధించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి అని ప్రముఖ సంగీత విద్వాంసులు ఎనమండ్ర శ్రీనివాసశర్మ అన్నారు. సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనా సంగీత ఉత్సవాలు సోమవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో తొలిరోజు నుంచే టి.ప్రకాష్, టి.బాలమురళీకృష్ణ బృందంతో నాదస్వరం ఆలపించి సంగీత కచేరీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మనిషి పాటించవలసిన నియమాలు, సదాచారాలు, సత్కార్యాలు నిక్కచ్చిగా పాటించి ఆదర్శప్రాయుడైన భక్తి సంగీత సామ్రాజ్య చక్రవర్తి త్యాగరాజ స్వామి అన్నారు. అటువంటి మహానీయుడు తెలుగు నాట జన్మించడం తెలుగు వారందరికీ వరం అన్నారు. ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుభొట్ల కృష్ణవేణి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు మోదుమూడి సుధాకర్, జొన్నవిత్తుల ప్రభాకర శాస్ర్తి, సుజాత కావూరు, పారుపల్లి సబ్బరాయ ఫల్గున్, కె.శశిధర్, గండూరి రమా సత్యనారాయణ, ఎం.మంజునాథ, అంజనా సుధాకర్, వేమూరి వెంకట విశ్వనాథ్, గండూరి శ్రీనివాసమూర్తి, పెద్దాడ శ్యామల, కందుల అనిల్ కుమార్లు పాల్గొన్నారు. నాదస్వరంతో పాటు తొలిరోజు మరో నాలుగు బృందాలు పాల్గొని కచేరీలు వినిపించారు.