ఇద్దరే..
ABN , Publish Date - Feb 07 , 2024 | 01:04 AM
జిల్లాల విభజన అయితే జరిపేశారు కానీ, ఆయా శాఖలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఫలితంగా ఏ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఒకవేళ కార్యాలయానికి బోర్డులు కనిపించినా అందులో సిబ్బంది కనిపించని దుస్థితి. ఇందుకు నిదర్శనమే జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (బీసీ వెల్ఫేర్). ఈ కార్యాలయంలోకి అడుగుపెడితే ఇద్దరంటే ఇద్దరే ఉద్యోగులు కనిపిస్తారు.వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కాగా, మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి.
![ఇద్దరే..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బీసీ సంక్షేమ శాఖలో ఉద్యోగుల సంఖ్య ఇదీ
ఐదారుగురు చేయాల్సిన పని ఇద్దరితో..
ఖాళీగా డీడీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
డెప్యుటేషన్లో సీనియర్ అసిస్టెంట్
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాల విభజన అయితే జరిపేశారు కానీ, ఆయా శాఖలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఫలితంగా ఏ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఒకవేళ కార్యాలయానికి బోర్డులు కనిపించినా అందులో సిబ్బంది కనిపించని దుస్థితి. ఇందుకు నిదర్శనమే జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (బీసీ వెల్ఫేర్). ఈ కార్యాలయంలోకి అడుగుపెడితే ఇద్దరంటే ఇద్దరే ఉద్యోగులు కనిపిస్తారు.వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కాగా, మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి.
ఎందుకిలా..?
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఒక డిప్యూటీ డైరెక్టర్, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిసెంట్లు ఉంటారు. ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖకు డిప్యూటీ డైరెక్టర్ లేరు. జిల్లా విభజన జరిగిన సమయంలో ఒక మహిళా అధికారిణి డీడీగా వ్యవహరించారు. తర్వాత ఆమె బదిలీపై మరో జిల్లాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఇన్చార్జుల పాలనలో డిప్యూటీ డైరెక్టర్ పోస్టు కొనసాగింది. ఇప్పుడు ఇన్చార్జి లేని అనాథగా మారిపోయింది. మహిళా అధికారిణి బదిలీపై వెళ్లిపోయాక డ్వామా పీడీ సునీతకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా ఉన్న నాయక్కు ఇచ్చారు. ఇటీవల జరిగిన బదిలీల్లో నాయక్ మరోచోటకు వెళ్లారు. దీంతో ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఇన్చార్జి బాధ్యతలను వదిలేశారు. ఇక అప్పటి నుంచి బీసీ సంక్షేమ శాఖకు డీడీని నియమించలేదు. మరొకరికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించలేదు.
ఖాళీగా
జిల్లా విభజన జరిగాక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఐదారుగురు సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు చేరింది. డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఖాళీ ఉంది. ఇక్కడ పనిచేయాల్సిన ఒక సీనియర్ అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి డెప్యుటేషన్పై వెళ్లిపోయారు. జిల్లా విభజన జరిగిన కొన్నిరోజులే ఆమె ఇక్కడ పనిచేశారు. ఆ తర్వాత ప్రధాన కార్యాలయానికి పరిమితమయ్యారు. మరో జూనియర్ అసిస్టెంట్ అనారోగ్యంతో కొద్దినెలల క్రితం మరణించారు. ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఒక సూపరింటెండెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) మాత్రమే ఉన్నారు. కార్యాలయాల వ్యవహారాలను ఈ ఇద్దరే చూసుకోవాల్సిన పరిస్థితి.